User Tools

Site Tools


వెర్రిబాగుల_వేమయ్య
				వెర్రిబాగుల వేమయ్య

లక్కపల్లి ఓ చిన్న ఊరు.రెండొందల గడపలుంటాయి. ఒకనాడు ఆ ఊరికి ఓ కుర్రవాడొచ్చాడు.అతనికి సుమారుగా ఇరవై ఏళ్ళుంటాయి.వదులుగా ఉన్న లాగు వేసుకున్నాడు.అది మోకాళ్ళ కిందికి వేలాడుతోంది.బాగా మాసిపోయింది.వాడి చొక్కా మోకాళ్ళ కిందికి వేలాడుతోంది.బాగా మాసిపోయింది.వాడి చొక్కా చినిగి వుంది.అది కూడా మాసిపోయే ఉంది.చేతుల్లో ఓ బట్టల మూట ఉంది.ఇలాంటి అవతారంతో ఊళ్ళోకి వచ్చాడు.ఏవరినీ ఏమీ అడగలేదు.తిన్నగా గుళ్ళోకి పోయి పడుకున్నాడు. “బాబూ! నీ పేరేమిటి?”అని పెద్దవాళ్ళు అడిగారు. “వేమయ్య” అన్నాడు కుర్రవాడు. “మీదేవూరు?” దీనికి వేమయ్య జవాబివ్వలేదు.'ఇహిహి' అని నవ్వాడు. “ఏ ఊరంటే నవ్వుతావేమయ్యా? నీదేవూరో,ఏ కులంవాడివో చెప్పు.” అన్నారు పెద్దవాళ్ళు. దానికి కూడా వాడు 'ఇహిహి' అని నవ్వాడు.అయితే 'వేమయ్యా' అనగానే ఉలిక్కిపడ్డాడు.దంతో అందరికీ అర్థమయ్యింది.వీడు వెర్రిబాగులవాడు.అంతే.అదే వాళ్ళకు అర్థమయ్యింది.ఇక ఈ వెర్రోడ్ని ఏమడుగుతాం అనుకున్నారు.అందరూ వాణ్ణి వెర్రి వేమయ్య అని పిలవసాగారు. ఆ రోజు నుంచి వేమయ్య లక్కపల్లిలోనే ఉంటున్నాడు.ఊళ్ళో బిచ్చం గుళ్ళో నిద్ర అంటారే-అలా ఉంది వాడి వ్యవహారం. అయితే వాడు ఎవరినీ ఏమీ అడగడు. టీ కొట్టు ముందు నిలబడతాడు.అలా చూస్తూ ఉంతాడు.టీ కావాలని మాత్రం అడగడు.ఎవరో ఒకరు జాలి పడతారు.వాడికి ఒక టీ ఇప్పిస్తారు.దాన్ని వాడు ఆబగా తీసుకుంటాడు.ఊది ఊది తాగుతాడు.తాగడం అయ్యాక గ్లాసు కడిగేస్తాడు.ఆ తర్వాత దర్జాగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడికి ఆకలి వేస్తే ఏం చేస్తాడో తెలుసా?ఎవరో ఒకరి ఇంటి ముందు నిలబడతాడు.'బువ్వ' అంటాడు.ఒకసారి గాదు.రెండుసార్లు గాదు.వాడికి అన్నం పెట్టేదాకా 'బువ్వ… బువ్వ' అని అంటూనే ఉంటాడు.రోజూ ఎవరో ఒకరు వాడికి అన్నం పెడతారు.వాడు కడుపు నిండా తింటాడు.అన్నం పెట్టిన వాళ్ళ వంక చూసి తమాషాగా నవ్వుతాడు.వీడి నవ్వుని చూసి వాళ్ళు నవ్వుకుంటారు. ఇక వేమయ్య పడుకునే దెక్కడనుకున్నాడు.దానికొక చోటంటూ లేదు.ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటాడు.అరుగుల మీద,రోడ్డు మీద,రచ్చబండ దగ్గర,గుళ్ళో-ఎక్కడైనా పడుకుంటాడు.పడుకునేటప్పుడు తల కింద బట్టల మూట పెట్టుకుంటాడు.ఆ మూటంటే వాడికి ప్రాణం.దాన్ని ఎవర్నీ తాకనివ్వడు. వాడు నిద్రపోయేటప్పుదు పెద్దగా గురక పెడతాడు.వాడు గురక పెట్టాడో ఇక ఆ చుట్టుపక్కల ఎవ్వరూ నిద్రపోలేరు.వాడి గురక చూసి అందరూ నవ్వుకోడమే. వాడి నిద్ర కుంభకర్ణుడి నిద్ర.వాడు నిద్రపోతే లేపడం ఎవ్వరి తరమూ కాదు.ఊళ్ళో కొందరు కొంటె పిల్లలు ఉన్నారు.సందు దొరికితే చాలు.వాళ్ళు వేమయ్యను ఏడిపించాలని చూస్తారు.వాడిని ఆటలు పట్టిస్తారు.నిద్రపోతున్నప్పుడు చిన్న చిన్న పుల్లలు వాడి నోట్లో పెడతారు.అయినా వాడు నిద్ర లేవడు.నిద్రలోనే ఆ పుల్లల్ని పటపటా నములుతాడు.ఆనక ఊసేస్తాడు. కొంటె పిల్లల పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తారు.గట్టిగా అరుస్తారు.కోడి ఈకతో వేమయ్య చెవిని గెలుకుతారు.ఇవన్నీ వాడ్ని నిద్రలేపుదామని చేస్తారు.అయినా వాడు లేస్తేనా? ఇన్ని చేసినా వేమయ్య నిద్ర లేవడు.అయితే వాడి బట్టల మూటను తాకితే చాలు.టక్కున లేచి కూచుంటాడు.ఆ మూటను ఎవరు తాకినా వాడికి చడ్డ కోపమొస్తుంది. “ఒరే… తంతా…. తంతా..” అని బెదిరిస్తాడు.నిద్రలో కూడా వాడికి మూట గురించిన యావే. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వేమయ్య కొలిమి దగ్గర నిలబడ్డాడు.దాని వంక అదే పనిగా చూడసాగాడు.ఆ కొలిమి ఒక కంసాలిది.అతని పేరు కామయ్య.కామయ్య ఇనుప పనిముట్లు తయారు చేస్తాడు.కొలిమిని మండించడానికి గాలి తిత్తి ఉంటుందిగా.వేమయ్య ఆ తిత్తి వంకే చిత్రంగా చూడసాగాడు.కామయ్య అది గమనించాడు. “ఏరా నా దగ్గర పనిచేస్తావా?” అని అడిగాడు. వేమయ్య మాట్లాడలేదు. “ఇలా రా! ఇలా వచ్చి ఈ తిత్తిని లాగు.ఇదిగో ఇలా… రా మరి.” అన్నాదు కామయ్య. వేమయ్య కొట్టంలోకి వెళ్ళాడు.పొయ్యి దగ్గర కూర్చున్నాడు.బట్టల మూటని ఒళ్ళో పెట్టుకున్నాడు.కామయ్య చెప్పినట్లే గాలి తిత్తిని లాగడం మొదలెట్టాడు.పొయ్యిలో నుంచి బుస్సుబుస్సు మంటూ శబ్ధం వచ్చింది.నిప్పు కణాలు పైకి ఎగిరాయి.వాడికి అదంతా తమాషాగా అన్పించింది.ఇంకేం.అలసిపోయే వరకు తిత్తిని లాగాడు.ఇక ఆరోజు నుంచి ప్రతి రోజూ వాడా పని చేస్తున్నాడు.ఆ పనంటే వాడికి భలే ఇష్టం. కామయ్య వాడికి లాగు,చొక్కా కుట్టించాడు.వాడు లాగు మాత్రమే వేసుకున్నాడు.ఎంత చెప్పినా చొక్కాని తొడుక్కోలేదు.వాడి లాగు మోకాళ్ళ కింది దాకా వేలాడుతుంటుంది. కామయ్య పెళ్ళాం పేరు అన్నమ్మ.వాళ్ళకు పిల్లలు లేరు.అందుకే ఆమె వేమయ్యను బిడ్డలా చూసుకునేది. అన్నమ్మ వేమయ్యకు ఎన్నో చెప్పింది.స్నానం చేయమంది.తలకు నూనె రాసుకోమంది.వెంట్రుకలు కత్తిరించుకోమంది.అయినా వాడు అవేమీ చెయ్యలేదు.చెయ్యమంటే చెయ్యనని మొరాయించాడు.పళ్ళెం నిండా అన్నం పెడితే మాత్రం లాగించేవాడు.చేసేది లేక అన్నమ్మ చెప్పి చెప్పి ఊరుకుంది. ఊళ్ళో కొంటెపిల్లలు అప్పుడప్పుడు వాడిని ఆటలు పట్టిస్తారు.వాడు నడుస్తూ ఉంటే “వెర్రిబాగుల వేమయ్యా!” అని పిలుస్తారు.వెనకగా వచ్చి వాడి వీపు మీద చరుస్తారు.కొందరు వాడి మీద చిన్నచిన్న రాళ్ళు విసురుతారు.కాగితపు ఉండలు,చెత్త విసురుతారు.ఇన్ని చేసినా వాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు.నెప్పి కలిగితే మాత్రం బిగ్గరగా ఎడుస్తాడు.“అన్నమ్మక్కా అన్నమ్మక్కా!” అని అరుస్తాడు.అప్పుడు అన్నమ్మ - ఎంత పనిలో ఉన్నా పరిగెత్తుకొని వస్తుంది.కొంటెపిల్లల్ని చీవాట్లు పెడుతుంది.వేమయ్యను ఇంటికి తీసుకొస్తుంది. వేమయ్య చేసే పనులు భలే నవ్వు తెప్పిస్తాయి.కొలిమి తిత్తి లాగేటప్పుడు వాడు లోకాన్నే మరిచిపోతాడు.ఇంతలో గుడి గంటలు విన్పిస్తాయి.గుడిలో కొబ్బరికాయలు కొడుతున్న శబ్ధం విన్పిస్తుంది.అంతే.చేస్తున్న పనిని టక్కున ఆపేస్తాడు.రివ్వున గుడి దగ్గరకు ఉరుకుతాడు.అక్కడ చాలా మంది పిల్లలు కన్పిస్తారు.వాళ్ళు కొబ్బరి ముక్కల కోసం పోటీ పడుతుంటారు.వేమయ్య కూడా వాళ్ళతో పోటీ పడతాడు.చాతనైనన్ని కొబ్బరి ముక్కలు ఏరుకుంటాడు.వాడికి అదో సరదా. గుళ్ళో పూజలు జరుగుతుంటాయి.రకరకాల ప్రసాదాలు పంచి పెడుతుంటారు.ప్రసాదం కోసం వేమయ్య వరసలో నిలబడతాడు.వరసలో వాడెప్పుడూ ముందే ఉంటాడు.పళ్ళు తోముకోడు.స్నానం చెయ్యడు.నుదుటి మీద విభూతి గీతలు మాత్రం పెద్దగా పెట్టుకుంటాడు.ఒకసారి ప్రసాదం తీసుకున్నాక ఊరుకోడు.మళ్ళీ వరసలో నిలబడతాడు.మళ్ళీ మళ్ళీ నిలబడతాడు.పూజారి నవ్వుతూ మళ్ళీ మళ్ళీ వాడికి ప్రసాదం పెడతాడు.కొందరు పిల్లలు తమ ఎంగిలి చేతుల్ని వాడి వీపు మీద తుడుచుకుంటారు. పక్క ఊళ్ళలో అప్పుడప్పుడు జాతరలు జరుగుతాయి.వేమయ్య ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతాడు.పక్కరోజు తిరిగి వస్తాడు.జాతరలో ఎవరైనా జాలి పడి మిఠాయిలు ఇస్తారు.వాడు ఆ మిఠాయిల్ని అన్నమ్మ కోసం దాచి తెస్తాడు.అన్నమ్మ 'నాకెందుకురా వేమా' అంటుంది.మళ్ళీ వాటిని వాడికే ఇస్తుంది. వేమయ్య వల్ల ఊరంతా సందడిగా ఉంటుంది.వాడి అమాయకత్వం అందరికీ నవ్వు తెప్పిస్తుంది.ఇప్పుడు వాడిని అందరూ ఇష్టపడుతున్నారు.ఊరి జనంలో ఒకడిగా అయిపోయాడు.అయితే మరీ చిన్నపిల్లలు మాత్రం వాడ్ని చూసి భయపడతారు.ఎందుకంటే వాడి జుత్తు, గెడ్డం,మీసం బాగా పెరిగి పోయాయి.వాటిని వాడు కత్తిరించుకోడు.నూనె రాసి దువ్వుకోడు.చింపిరి చింపిరిగా ఉంటాయవి.అందుకే కొంతమంది తల్లులు బిడ్డల్ని భయపెడుతుంటారు. “ఏడిస్తే వెర్రి వేమయ్యకు ఇచ్చేస్తా” అని బెదిరిస్తారు.దెబ్బకు ఆ పిల్లలు ఏడుపు మానేస్తారు. వేమయ్య లక్కపల్లికి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచాయి.ఇన్నేళ్ళు వాడు ఆ ఊళ్ళో బతికాడు.ఆ ఊళ్ళో పుట్టి పెరిగిన మనిషిలాగే అయిపోయాడు.ఇంతలో అనుకోని కష్టకాలం దాపురించింది. రెండేళ్ళుగా ఆ ప్రాంతంలో వానలు పడలేదు.వానలు లేకపోతే ఇక పంటలెక్కడివి.పంటలు లేకపోతే బతకడం ఎట్లా?… ఎక్కడ చూసినా కరువే.ఏ ఊళ్ళో చూసినా కరువే.పేదవాళ్ళు పొట్ట చేత బట్టుకొని వలస పోతున్నారు.బతుకుతెరువు కోసం వేరే ప్రాంతాలకు పోతున్నారు.కొందరు మద్రాసుకు పోయారు.కొందరు హైదరాబాదుకు పోయారు.ఇంకొందరు గోదావరి జిల్లాలకు పోతున్నారు.అక్కడికి పోవాలంటే తిరుపతిలో రైలు ఎక్కాలి. రైలు స్టేషన్ లో ఒకటే జనం.గుంపులు గుంపులుగా జనం.స్టేషన్ కిటకిటలాడుతోంది.రైలు ఇంకా రాలేదు.అందరూ ఎదురు చూస్తున్నారు. కనకమ్మ అనే ఆమె ఓ బెంచీ మీద కూర్చుంది.ఆమె వళ్ళో ఓ పసిబిడ్డ.ఆ బిడ్డ అదేపనిగా ఏడుస్తోంది.కనకమ్మ బిడ్డకు పాలిచ్చింది.అయినా బిడ్డ ఏడుపు మానలేదు.అసలు కనకమ్మ వంట్లో పాలు ఉంటేగా.కొన్ని వారాలుగా ఒక్కపూట భోజనమే తింటోంది.ఇక పాలెక్కడ పడతాయి. బిడ్డ ఆకలికి నకనక లాడిపోతోంది.అందుకే బాగా ఏడుస్తోంది. “ఇదిగో ఏడ్వమాకురా.ఏడిస్తే నిన్ను ఎర్రి యేమయ్యకు ఇచ్చేత్తా.” అంటూ కనకమ్మ బెదిరించింది.అయినా బిడ్డ ఏడ్పు ఆపలేదు. “చేప్పేది నీకే అదిగో… ఎర్రి యేమయ్య ఇక్కడే ఉండాడు.ఆడికి నిన్నిచ్చేత్తా.” కనకమ్మ మళ్ళీ బెదిరించింది. మళ్ళీ మళ్ళీ వేమయ్య పేరు చెప్పింది. ఆమెకు దగ్గర్లోనే ఒక పెద్దమనిషి కూర్చొని ఉన్నాడు.ఆయనకు బట్టతల,ఖద్దరు పంచ,జుబ్బా తొడుక్కున్నాడు.చేతిలో ఈ పసుపురంగు సంచీ ఉంది.బాగా ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. “ఏమ్మా,మీది ఏ ఊరు?” అంటూ ఆయన అడిగాడు. “లక్కపల్లి సామీ.” అంది కనకమ్మ. “వెర్రి వేమయ్య అంటే ఎవరమ్మా?” “మాఊళ్ళో ఓ ఎర్రిబాగులాడున్నాడు సామీ.ఆడి పేరే ఎర్రి యేమయ్య.” అంది కనకమ్మ. “అతను మీ ఊరి వాడేనా?” అతృతగా అడిగాడు పెద్దమనిషి. “కాదు సామీ.ఎ ఊరో తెలీదు.మా ఊరికొచ్చి పదిహేనేండ్లయింది.” “ఇప్పుడతను మీ ఊర్లొనే ఉన్నాడా?” “ఆ.కంసాలి కామయ్య దగ్గర ఉంటున్నాడు.” అంది కనకమ్మ.వెంటనే మళ్ళీ తన బిడ్డను లాలించడంలో మునిగిపోయింది. పెద్దమనిషి వెంటనే లక్కపల్లికి బయలుదేరాడు.గంటసేపు ప్రయాణం చేసి లక్కపల్లి చెరుకున్నాడు.తిన్నగా కామయ్య ఇంటికి వెళ్ళాడు.అప్పుడు వేమయ్య గాలితిత్తి లాగుతున్నాదు. పెద్దమనిషి వేమయ్యను గుచ్చిగుచ్చి చూశాడు.కళ్ళార్పకుండా చూశాడు.కొన్ని నిమిషాల పాటు అలా చూశాడు. ఆ తర్వాత పరుగున వెళ్ళి వేమయ్యను కౌగలించుకున్నాడు. “తమ్ముడూ!వేమా!” అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. వేమయ్య బిత్తరపోయాడు.కామయ్యకు అంతా అశ్చర్యంగా ఉంది.కొంతసేపటికి పెద్దమనిషి చెప్పాడు - “అయ్యా!నా పేరు వెంకటరెడ్డి.మాది ఒంగోలు.ఈ వేమారెడ్డి నాసొంత తమ్ముడు.చిన్నప్పుడు అందరిలాగే ఉండేవాడు.పదిహేనేళ్ళ కింద నెత్తికి దెబ్బ తగిలింది.అప్పటినుంచి మతి స్థిమితం తప్పింది.ఒకరొజు ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమైపోయాడు.అప్పటినుంచి వీడి కోసం వెదకని ఊరు లేదు.చెయ్యని ప్రయత్నం లేదు.చివరకు ఇన్నాళ్ళకు కనిపించాడు.ఊరిలో వీడి పేర లక్షల ఆస్తి వుంది.వీడి తలరాత చూస్తే ఇలా అయ్యింది.” అంటూ పెద్దమనిషి ఇంకా ఏడ్చాడు. వేమయ్య బండరాయిలా కూర్చున్నాడు.ఊరు జనమంతా కొలిమి దగ్గరకు చేరారు.అన్నమ్మ కూడా అక్కడికి వచ్చింది.అమెను చూడగానే వేమయ్య పరిగెత్తుకెళ్ళాడు.అన్నమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాడు.“అన్నమ్మక్కా.అన్నామ్మాక్కా” అంటూ బిగ్గరగా ఏడ్చాడు.అన్నమ్మ కూడా ఏడ్చింది.కామయ్యకు కూడా ఏడుపు ఆగలేదు.అది చూసి అందరూ కళ్ళు వత్తుకున్నారు. “ఇన్నాళ్ళూ వేమయ్య ఎవరో మనకు తెలీదు.ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు.వాడొక కలవారి బిడ్డ అని ఇప్పుడే తెలిసింది. ఇక వాడిని వాడి అన్నయ్యతో పంపవలసిందే.” అన్నారు ఊరి పెద్దలు. అయిదారు మంది వేమయ్యను గట్టిగా పట్టుకున్నారు.వాడికి చక్కగా క్రాపు చేశారు.పెరిగిన గెడ్డం,మీసాలు తీసేశారు.ఒళ్ళంతా బాగా నూనె పట్టించారు.బావి గట్టున కూర్చోబెట్టారు.బిందెలు బిందెలు నీళ్ళు గుమ్మరించారు.వాడికి శుభ్రంగా స్నానం చేయించారు.కొత్త లాగు,కొత్త చొక్కా తొడిగారు. ఇవన్నీ జరుగుతున్నంత సేపు వేమయ్య ఏడుస్తూనే ఉన్నాడు.అయినా సరే ఇప్పుడు వాడు ఎంతో అందంగా ఉన్నాడు. అన్నమ్మ పళ్ళెం నిండా అన్నం పెట్టింది.వాడు ఓ పక్క ఏడుస్తూనే - కడుపు నిండా తిన్నాడు. ఊళ్ళోని జనమంతా కామయ్య ఇంటి ముందు నిలబడ్డారు.వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్ళాడు.చేతిసంచీ లోంచి నోట్ల కట్టలు తీసాడు. “మీరు మరోలా అనుకోకండి.వీటిని ఉంచండి.” అన్నాడు కామయ్య,అన్నమ్మలతో. వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు.వెంకటరెడ్డి ఎంత బతిమాలినా అ డబ్బుని తీసుకోలేదు. అయిదు గంటలకు ఆ ఊరు నుంచి బస్సు ఉంది.అందరూ బస్సుస్టాపుకు చేరుకున్నారు.వేమయ్య ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు.చిన్న పిల్లలు వాడి చేయిపట్టుకుని నడిపించారు.పిల్లలు,ముసలివాళ్ళు.అడవాళ్ళు,పెద్దవాళ్ళు - అందరూ వాడి చుట్టూ నిలబడ్డారు. అన్నమ్మ వేమయ్య పక్కనే నలబడింది.వాడికి ఓ గిన్నె నిండా మిఠాయి కొనిపెట్టింది.అందరికంటే అమెకు ఎక్కువ బాధగా ఉంది. బస్సు వచ్చింది. “వెళ్ళిరా నాయనా” అంది అన్నమ్మ కన్నీళ్ళు వత్తుకుంటూ. వేమయ్య బిగ్గరగా అరిచాడు.పెద్దగా ఏడ్చాడు.నేలమీద చతికిలబడ్డాడు.అన్నమ్మ రెండు కాళ్ళు పట్టుకుని బావురుమని ఏడ్చాడు. “నేను పోను.నేను పోను.” అంటూ వెక్కిళ్ళు పెట్టాడు. అందరి మనసులూ ఉస్సురన్నాయి. నలుగురు పెద్దవాళ్ళు వేమయ్య రెండు రెక్కలు పట్టుకున్నారు.బలవంతంగా వాడ్ని బస్సు ఎక్కించారు.కిటికీ పక్క సీట్లో కూర్చోబెట్టారు.బస్సు బయలుదేరింది. వేమయ్య కిటికీలోంచి బయటికి దూకేయాలని చూస్తున్నాడు.తన రెండు చేతులూ బయటకు సాచాడు,'అన్నమ్మక్కా అన్నమ్మక్కా' అంటూ పిలుస్తున్నాడు. అదేపనిగా ఏడుస్తున్నాడు. అన్నమ్మ బావురుమంది.వాడు వెళ్ళిపోవడం ఊళ్ళో అందరికీ బాధగానే ఉంది.వెంకటరెడ్డి అందరికీ చేతులు జోడించి దణ్ణం పెట్టాడు.ఆయనకు కూడా దు:ఖం ఆగలేదు. “ఈ ఊరి జనం కరువుతో కటకటలాడుతున్నారు. పేదరికంలో మగ్గిపోతున్నారు. అయినా సరే వీళ్ళ మనసుల్లో ఎంత ప్రేమ!” అనుకున్నాడు. “ఈ ఊరి జనం కోసం ఏమన్నా చేయాలి.” అనుకుంటూ కన్నీళ్ళు వత్తుకున్నాడు. చూస్తూ ఉండగానే బస్సు వెళ్ళిపోయింది. ఉన్నట్టుంది లక్కపల్లి బోసిపోయింది. అందరూ దిగులుగా ఇళ్ళకు బయలుదేరారు.

వెర్రిబాగుల_వేమయ్య.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)