User Tools

Site Tools


మంచి_మనిషి
               			              మంచి మనిషి

జేసుదాసు ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు.చిన్నప్పుడే తల్లి పోయింది.నాన్న కట్టెలు కొట్టి సంపాదించేవాడు.ఒకనాడు అతనూ పోయాడు.ఓ పెద్ద చెట్టు పై నుంచి పడి చనిపోయాడు. అమ్మానాన్నలు పోయాక జేసుదాసు అక్క పంచన చేరాడు.అక్కకు పెళ్ళయింది.ఎనిమిది మంది పిల్లలు.ఎనిమిదో బిడ్డ పుట్టగానే భర్త పోయాడు.అక్క జేసుదాసుని కన్న తల్లిలా చూసుకునేది.అయితే అంతమంది పిల్లల్ని పోషించలేక ఆమె సతమతమయేది.లోలోపల కుమిలిపోయేది. జేసుదాసు అక్క బాధని చూడలేకపోయాడు. చిన్న పిల్లాడే అయినా తనూ సంపాదించడం మొదలుపెట్టాడు.నాన్న లాగే కట్టెలు కొట్టేందుకు పోసాగాడు.కూలి డబ్బులు మొత్తం అక్క చేతికి ఇచ్చేస్తాడు.అక్క పిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. తినేది పది మంది.సంపాదించేది మాత్రం ఇద్దరే. ఎలా సరిపోతుంది? వాళ్ళిద్దరూ ఎంత కష్టపడినా లాభం లేకపోయేది.అందరికీ సగం కడుపే నిండేది.ఆకలితో నకనకలాడిపోయేవారు.ఒక్కోసారి ఆ సగం కడుపు కూడా నిండేది కాదు.అలాంటప్పుడు అందరూ పస్తే.పేదవాళ్ళ బతుకులు ఇంతకన్నా గొప్పగా ఎలా ఉంటాయి.కూలి దొరికిందా తిండి.లేదంటే పస్తే. ఇంతలో వానాకాలం వచ్చింది.వరుసగా నాలుగు రోజులు కుండపోతగా వాన కురిసింది.అక్కకు కూలిపని దొరకలేదు.జేసుదాసుకీ దొరకలేదు.ఇంట్లో చిట్టెడు గింజల్లేవు.ఆకలితో పిల్లలు నకనకలాడిపోతున్నారు.తిండి కావాలని ఏడుస్తున్నారు.“ఓరి దేవుడా!ఎలాంటి కష్టం వచ్చిందిరా” అని అక్క కూడా ఏడ్చింది.జేసుదాసు తట్టుకోలేకపోయాడు.ఎలాగైనా సరే పిల్లలకు తిండి తేవాలని బయలుదేరాడు.ఆలోచిస్తూ బజారులో తిరిగాడు. ఓ రొట్టెల దుకాణం కనిపించింది.రకరకాల రొట్టెలు,కేకులు,బిస్కెత్తులు - అన్నీ అద్దాల బీరువాలో పేర్చారు.కళ్ళు జిగేలు మనే లైట్లు!నోరూరించే మిఠాయిలు! జేసుదాసు వాటి వంక రెప్ప ఆర్పకుండా చూసాడు.మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చేసాడు.దొంగతనం చేస్తే? అనుకున్నాడు.“ఊహూ!అలా చెయ్యడం మంచి పని కాదు” అనుకున్నాడు.ఇంతలో పిల్లల ముఖాలు గుర్తొచ్చాయి.ఎండిపోయిన పసివాళ్ళ డొక్కలు కళ్ళలో మెదిలాయి.“మామయ్యా!ఆకలి!” అని వాళ్ళు ఏడ్వడం గుర్తొచ్చింది.అంతే,జేసుదాసు ఇంకేమీ ఆలోచించలేదు. అద్దాల బీరువా పగలగొట్టాడు.చేతిలో ఓ పెద్ద గాజు ముక్క దిగింది.ఐనా లెక్క చేయలేదు.అందిన రొట్టెను దొరకబుచ్చుకున్నాడు. రొట్టెల కొట్టువాడు“దొంగ దొంగ” అని కేకలేసాడు. జనం పోగయ్యారు.అంతా కలిసి జేసుదాసును తరిమారు. జేసుదాసుకి భయమేసింది.రొట్టెముక్కలు పారేసి ఇంకా జోరుగా పరుగెత్తాడు.అయినా లాభం లేకపోయింది.జనం అతడ్ని పట్టుకున్నారు. “పిల్లల ఆకలి భాద చూడలేక ఈ పని చేశాను.ఇంకెప్పుడూ చేయను.నన్ను వదిలేయండి” అని జేసుదాసు ఏడ్చాడు.అందరి కాళ్ళ మీదా పడి వేడుకున్నాడు.అయినా ఎవరు మనసూ కరగలేదు.దొంగతనం చేసినందుకు అతడ్ని చితగగొట్టారు.చివరకు పోలీసులకు అప్పగించారు. కోర్టులో విచారణ జరిగింది.జేసుదాసుకి ఐదేళ్ళ జైలు శిక్ష వేసారు.జైల్లో జేసుదాసు మెడకు,కాళ్ళకు సంకెళ్ళు వేసారు.ఓడలో పని చేయడానికి పంపారు.అతడి బతుకు బానిసల కంటే అన్యాయంగా మారింది.ఈడలో రాత్రింబవళ్ళూ పని చేయించేవారు.ఒకటే వెట్టి చాకిరి. అక్క ఎలా ఉందో? పిల్లలు ఎలా ఉన్నారో? వారంతా ఏమైపోయారో? ఎక్కడ ఉన్నారో?… అని జేసుదాసు దిగులు పడేవాడు. 'తప్పించుకు పారిపోతే!' అని ఆలోచించేవాడు. ఒకనాడు పారిపోయే అవకాశం దొరికింది.అప్పటికి నాలుగేళ్ళ శిక్ష పూర్తయింది.ఇంకో సంవత్సరం ఉంటే చాలు.వదిలేసేవారు.అయినా అక్కని,పిల్లల్ని చూడాలని తప్పించుకున్నాడు.అయితే మూడవ రోజునే పోలీసులు మళ్ళీ పట్టుకున్నారు. జైలు నుంచి తప్పించుకుపోవడం నేరం.ఆ నేరం చేసినందుకు జేసుదాసుకు మరో ఐదేళ్ళ శిక్ష వేసారు.పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టు అయ్యింది.ఇక భరించలేకపోయాడు.మరో మూడుసార్లు తప్పించుకుపోయే ప్రయత్నాలు చేసాడు.అయితే ఆ మూడుసార్లు ఇలా తప్పించుకున్నాడో లేదో అలా పట్టుబడ్డాడు.అలా అతడి శిక్షాకాలం ఇంకా ఇంకా పెరిగింది.మొత్తం పందొమ్మిది సంవత్సరాలు జైలులో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు శిక్ష ముగిసింది.జేసుదాసుని వదిలేసారు.ఎంత ఘోరమైన విషయం! ఒక చిన్న రొట్టె ముక్క కోసం పందొమ్మిది సంవత్సరాలు జైలులో ఉంచారు! ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? జైలుకి వెళ్ళేటప్పుడు జేసుదాసు ఒక మామూలు మనిషి. ఎంతో అమాయకుడు.అన్నెం పున్నెం ఎరగని వాడు.అయితే జైలు జీవితం అతడ్ని మార్చేసింది.అతడి మనసు కఠినంగా మారిపోయింది.మనిషి మొరటుగా తయారయ్యాడు.అందరి మీద కసి పెంచుకున్నాడు.పసిపిల్లల ఆకలి తీర్చడం కోసం ఓ రొట్టెముక్క దొంగతనం చేసాడు.దాని కోసం ఇన్నేళ్ళు జైళ్ళో పెడతారా? జైళ్ళో ఓ మంచి పని కూడా జరిగింది.జేసుదాసు చదవడం,రాయడం నేర్చుకున్నాడు. జైలు నుంచి వదిలేసేటప్పుడు అతనికి ఓ పసుపు కార్డు ఇచ్చారు.దానిని ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలని చెప్పారు.అందులో - “ఇతను 19 సంవత్సరాలు జైలులో ఉన్నాడు.చాలా ప్రమాదకరమైన మనిషి” అని రాసి ఉంది.జేసుదాసు పళ్ళు పటాపటా కొరుక్కున్నాడు. జేసుదాసు నాలుగు రోజులు నడిచి,ఓ పట్టణం చేరుకున్నాడు.ఈ నాలుగు రోజులూ పస్తే.తినడానికి ఏమీ దొరకలేదు. చేతిలో కర్ర,మాసిన గడ్డం.వీపున గోనెసంచి.ముఖంలో అలసట.ఇలాంటి అవతారంతో ఒక హోటల్ కి వెళ్ళాడు.ఆ హోటల్ లో పడుకొనేందుకు వీలుంది. “అయ్యా! నాకు భోజనం కావాలి.అలాగే రాత్రి ఉండేందుకు గది కూడా కావాలి” అన్నాడు జేసుదాసు హోటల్ యజమానితో. “నీ దగ్గర డబ్బుందా?” అన్నాడు యజమాని ఎగాదిగా చూసి. “ఉందండీ” అన్నాడు జేసుదాసు.అయినా హోటల్ యజమానికి తృప్తి కలగలేదు.ఏదో అనుమానం. ఆ ఊరి మేయర్ ని కలిసి సంగతి విచారించాడు.జేసుదాసు ఎవరో ఏమిటో తెలిసింది.ఇంకేం.కోపంతో ఊగిపోయాడు. “ముందు బయటికి నడు” అని జేసుదాసుని గద్దించాడు. “అయ్యా!ఆకలికి తట్టుకోలేకపోతున్నాను.బస ఇవ్వకపోతే పోయారు.కనీసం ఇంత తిండైనా పెట్టండి” అని బతిమాలాడు జేసుదాసు. “నీలాంటి వాళ్ళకి తిండి పెడితే పాపం చుట్టుకుంటుంది.పోతావా లేక మెడపట్టి గెంటించాలా?” అన్నాడు హోటల్ యజమాని గుడ్లురిమి.చేసేది లేక జేసుదాసు బయటికి వచ్చాడు.తల వంచుకుని నడవసాగాడు. అది చలికాలం.పెద్దపెట్టున మంచు కురుస్తోంది.జేసుదాసు చలికి గజగజ లాడిపోతున్నాడు.ముందే ఆకలితో పేగులు నకనక లాడుతున్నాయి.దానికి తోడు ఈ చలి ఒకటి. కాళ్ళీడ్చుకుంటూ మరో హోటల్ కి వెళ్ళాడు.అక్కడా అలాంటి అవమానమే జరిగింది.ముందుగా యజమాని గది ఇచ్చాడు.ఇంతలో ఎవరో వచ్చి యజమాని చెవిలో గుసగుసలాడారు. “వీడు పాత ఖైదీ.చాలా ప్రమాదకరమైన మనిషి” అని చెప్పాడు.అంతే,జేసుదాసుని అక్కడ నుంచి కూడా గెంటేసారు. పట్నంలో అందరూ జేసుదాసు గురించే మాట్లాడుకుంటున్నారు.“వాడు గజదొంగట.చాలా ప్రమాదకరమైన మనిషట.ఎలాంటి ఘోరమైనా చెయ్యగలడట.పందొమ్మిదేళ్ళు జైల్లో ఉండి వచ్చాడట” అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.భోజనం సంగతి సరే.కనీసం తాగడానికి ఓ గ్లాసుడు మంచినీళ్లైనా ఎవరూ ఇవ్వడం లేదు. జేసుదాసు ఇంకేం చెయ్యగలడు? ఎక్కడికని పోగలడు? ఉస్సురంటూ ఓ చర్చిని చేరుకున్నాడు.చర్చి ముందు ఓ రాతి బెంచీ ఉంది.దాని మీద ముడుచుకుని పడుకున్నాడు.చలికి గజాగజా వణికిపోతున్నాడు. కొంచెం సేపటికి ఓ ముసలమ్మ అటుగా వచ్చింది.“ఎవరు నువ్వు?ఇక్కడ ఎందుకు పడుకున్నావు?” అని ఆరా తీసింది. “అమా! నేనొక నిరిపేదని.తినడానికి తిండి లేదు.ఉండడానికి చోటు లేదు.ఎవరూ నాకు సాయం చేయడం లేదు” అన్నాడు జేసుదాసు దిగులుగా. “అయ్యో పాపం!” అందా ముసలమ్మ జాలిపడుతూ. “ఇదిగో ఆ ఇంటికి వెళ్ళు.అందులో ఒక మహాత్ముడు ఉంటున్నాడు.ఆయన నీకు తప్పక సాయం చేస్తాడు.” అంటూ ఓ ఇంటిని చూపించింది. జేసుదాసు ఆ ఇంటివైపు నడిచాడు.ఆ ఇల్లు 'దేవదానం' అనే ఓ ఫాదర్ ది.ఆయన చాలా మంచివాడు.అందరిని ప్రేమగా చూస్తాడు.పేదలకు ఎప్పుడూ సాయం చేస్తాడు.ఆయనకు ఓ పెద్ద భవనం ఉండేది.దాన్ని ఆసుపత్రి కోసం దానం చేసాడు.ఇప్పుడు ఓ చిన్న ఇంటిలో ఉంటున్నాడు.ఆ ఇంట్లో ఆయనతో పాటు ఆయన అక్కగారు,ఓ పనిమనిషి కూడా ఉంటున్నారు.ఆయన తన ఇంటికి ఎప్పుడూ తాళం వేయడు. 'సాయం కోసం ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు.తాళం వేస్తే ఎలా' అంటాడు. “పట్నంలోకి ఓ గజదొంగ వచ్చాడట ఫాదర్.చాలా ప్రమాదకరమైన మనిషట.అందరూ తమ ఇళ్ళకు తాళాలు వేసుకున్నారు.మనం కూడా వేసుకోవాలి” అంది పని మనిషి. ఫాదర్ చిరునవ్వు నవ్వాడు. సరిగ్గా అప్పుడే జేసుదాసు “అయ్యా!” అని పిలిచాడు.ఫాదర్ అతడ్ని లోనికి రమ్మన్నాడు.జేసుదాసుని చూడగానే అక్కగారు,మనిమనిషి భయపడ్డారు.ఫాదర్ మాత్రం మామూలుగానే ఉన్నాడు. “అయ్యా! నేనొక పాత ఖైదీని.పంతొమ్మిది సంవత్సరాలు జైలులో ఉండి వచ్చాను.మొన్ననే విడుదలయ్యాను.నాకు ఎవరూ తిండి పెట్టడం లేదు.ఉండేందుకు ఇంత చోటు కూడా ఇవ్వడం లేదు.తమరు నాకింత భోజనం పెట్టగలరా? ఉండేందుకు ఇంత చోటు ఇవ్వగలరా?” అని దీనంగా అడిగాడు జేసుదాసు. “దానికేం నాయనా!” అన్నాడు ఫాదర్.వెంటనే పనిమనిషిని పురమాయించాడు. “ఈయనకు వెంటనే భోజనం పెట్టు. పడుకునేందుకు ఏర్పాటు చెయ్యి” అన్నాడు. జేసుదాసు ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. “అయ్యా! మీరు చాలా మంచివారు.మిగతా వారిలా నన్ను కుక్కను తరిమినట్టు తరమలేదు.నాకు భోజనం పెడుతున్నారు.పడక కూడా వేయిస్తున్నారు.మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను” అన్నాడు ఫాదర్ తో.ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. జేసుదాసును ఫాదర్ ఒక అతిధిలా గౌరవించాడు.జేసుదాసుకి వెండిపళ్ళాల్లో భోజనం వడ్డించారు.ఎవరైనా అతిథులు వచ్చినపుడు మాత్రమే వెండి పళ్ళాలను తీస్తారు.అతడి కోసం వెండి దీపపు సెమ్మీలను కూడా వెలిగించారు. జెసుదాసు కడుపు నిండా అన్నం తిన్నాదు.తర్వాత మెత్తని పడక మీద హాయిగా నిద్రపోయాడు.మరికొంత సేపటికి ఆ ఇంట్లో అందరూ నిద్రపోయారు. రాత్రి రెండయ్యింది.చర్చిలోని గడియారం రెండు సార్లు టంగుమని మోగింది.జేసుదాసు ఉలిక్కిపడి నిద్రలేచాడు.ఇక ఆ తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. ఊరికే అటూ ఇటూ పొర్లాడు.చిన్నప్పటి నుంచీ పడిన కష్టాలు గుర్తొచ్చాయి.మనసుకి బాధగా అన్పించింది.ఇంకా ఎంత కాలం తనకీ కష్టాలు? ఏదో ఒకటి చేయాలి.ఇక ముందైనా సుఖంగా బతకాలి. అతనికి ఉన్నట్టుండి వెండిపళ్ళాలు మనసులో మెదిలాయి.తనకు భోజనం వడ్డించినప్పుడు చూసిన వెండి పళ్ళాలు! “వాటిని దొంగిలిస్తే?” అనుకున్నాడు.'బాగానే ఉంటుంది.మంచి ధర పలుకుతాయి.తన కరువు తీరిపోతుంది.అమ్మగా వచ్చే డబ్బుతో ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు?' అనుకున్నాడు.చాలాసేపు దాని గురించే ఆలోచించాడు.తర్వాత మెల్లగా లేచాడు.చప్పుడు చేయకుండా భోజనాల గదికి వెళ్ళాడు.వెండిపళ్ళాలు తీసుకున్నాడు.తలుపులు వేసి బయటికొచ్చాడు.గోడ ఎక్కి దూకి చీకటిలో ఎటో పారిపోయాడు. తెల్లవారింది. “వెండి పళ్ళాలు కన్పించడం లేదు దేవుడోయ్” అని పని మనిషి కేకలు పెట్టింది. “రాత్రి వచ్చినవాడే కాజేసి ఉంటాడు” అని కూడా అంది. “పోనీలే పాపం.పేదవాడేగా.దేనికో ఒకదానికి పనికొస్తాయి” అన్నాడు ఫాదర్.ఆయనకు ఇసుమంత కూడా బాధ కలగలేదు. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. నలుగురు పోలీసులు ఒకతని చొక్కా పట్టుకొని లాక్కొచ్చారు.వారు లాక్కొచ్చింది ఎవర్నో కాదు.జేసుదాసునే! ఫాదర్ కి అంతా అర్థమయ్యింది.అయితే ఆయనకు జేసుదాసు మీద కోపం రాలేదు.అపారమైన దయ కలిగింది. “నాయనా! ఈ వెండి దీపపు సెమ్మీలను ఎందుకు తీసుకోలేదు.వాటిని కూడా నీకు ఇచ్చానుగా” అన్నాడు జేసుదాసుతో. పోలీసులకు తల తిరిగినట్లయ్యింది.“అయితే… అయితే… వీడు చెప్పింది నిజమేనా ఫాదర్?” అన్నారు అయోమయంగా. “ఏం చెప్పాడు?” అని ఫాదర్ అడిగాడు. “ఈ వెండి పళ్ళాలు నేను దొంగిలించలేదు.ఫాదర్ దేవదానం గారే నాకు ఇచ్చారు అన్నాడు.” అన్నారు పోలీసులు. “నిజమే.వాటిని నేను ఇచ్చాను” అన్నాడు ఫాదర్. పోలీసులు జేసుదాసుని వదిలేసారు.క్షమించమని అడిగి వెళ్ళిపోయారు. జేసుదాసు ఉక్కిరి బిక్కిరైపోయాడు.అతనికి నోట్లోంచి మాట రాలేదు.నిజమా కలా అనుకున్నాడు.పోలీసులు పట్టుకోగానే తన పని అయిపోయింది అనుకున్నాడు.మళ్ళీ ఏ పదేళ్ళో పదిహేనేళ్ళో జైళ్ళో పడేస్తారు అనుకున్నాడు.తన బతుకిక జైల్లోనే ముగుస్తుంది అనుకున్నాడు.కాని… ఈ మహాత్ముడు… జేసుదాసుకు గుండె లోతుల నుంచి దు:ఖం తన్నుకొచ్చింది.సరిగ్గా అప్పుడే- “వీటిని కూడా తీసుకో నాయనా!” అంటూ వెండి దీపపు సెమ్మీలను అతని చేతిలో పెట్టాడు ఫాదర్.ఇక జేసుదాసు ఓర్చుకోలేకపోయాడు.దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు.ఉన్నపళంగా బావురుమన్నాడు. ఎప్పుడో పంతొమ్మిది సంవత్సరాల కిందట తాను ఏడ్చాడు.మళ్ళీ ఇన్నాళ్ళకు ఏడుస్తున్నాడు.ఫాదర్ దేవదానం చూపించిన ప్రేమ అతడ్ని వెక్కివెక్కి ఏడ్చేలా చేసింది. “అయ్యా!మీరు నిజంగా దేవుడులాంటి మనిషి.నన్ను మన్నించండి.ఇంకెప్పుడూ దొంగతనం చేయను” అని ఫాదర్ కాళ్ళ మీద పడ్డాడు.పొగిలి పొగిలి ఏడ్చాడు. “ఊరుకో నాయనా.ఏడ్వకు.నీ మాటల్ని నేను నమ్ముతున్నాను.సహజంగా నువ్వు మంచివాడివి.లే.లేచి కన్నీళ్ళు తుడుచుకో.ఈ వెండి సామాన్లు అమ్మి ఏదన్నా వ్యాపారం చేసుకో.నాలుగు కాలాలు సుఖంగా బతుకు” అంటూ ఫాదర్ ఓదార్చాడు. జేసుదాసు ఫాదర్ కి మరీ మరీ నమస్కరించాడు.ఆయన ఇచ్చిన వెండి సామాన్లు తీసుకుని బయలుదేరాడు.సాయంత్రానికి ఓ నగరం చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి అక్కడ ఓ ఇల్లు మంటల్లో చిక్కుకుంది.పెద్ద పెద్ద మంటలు లేచాయి.అది ఓ పోలీస్ ఇన్స్పెక్టరు ఇల్లు.ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.ఐతే లోనికి పోవడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. ఇంట్లోని పిల్లలు ఏడుస్తున్నారు.బయటివాళ్ళాంతా అయ్యో అయ్యో అని అరుస్తున్నారు. జేసుదాసు అది చూసాడు.రివ్వున ఇంటిలోకి దూసుకెళ్ళాడు.లోన ఏడుస్తున్న ఇద్దరు పసివాళ్ళనూ పట్టుకున్నాడు.క్షేమంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు.అలా ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. అందరూ జేసుదాసుని పొగిడారు.“నువ్వు చాలా గొప్పవాడివి.ప్రాణాలకు తెగించి మరీ పిల్లల్ని కాపాడావు” అన్నారు. అతడు ఎవరూ ఏమిటి అని ఒక్కరూ అడగలేదు.ఇన్స్పెక్టర్ అతడ్ని ఆ ఊళ్ళోనే ఉండమన్నారు.జేసుదాసు అందుకు ఒప్పుకున్నాడు. జేసుదాసు తన పేరు మార్చుకున్నాడు.ఇప్పుడు జేసుదాసు పేరు దావీదు.ఆ నగరంలో గాజు వస్తువులు పెద్ద ఎత్తున తయారు చేస్తారు.జేసుదాసు ఆ వృత్తిలో చేరాడు.బాగా కష్టపడి పని చేసాడు.ఏయే వస్తువులు ఎలా తయారు చేస్తారో శ్రద్ధగా గమనించాడు.ఆ పనిలో మంచి నేర్పు సంపాదించుకున్నాడు. కొన్నాళ్ళకు గాజుపని బాగా అబ్బింది.కొత్త కొత్త వస్తువులు కూడా తయారు చేయడం వచ్చింది.ఫాదర్ ఇచ్చిన వెండి పళ్ళాలు అమ్మాడు.సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాడు.వెండి సెమ్మీలు మాత్రం అమ్మలేదు.ఫాదర్ దేవదానం గారి గుర్తుగా వాటిని తన వద్దే ఉంచుకున్నాడు. జేసుదాసు తయారు చేసే వస్తువులు నాణ్యంగా ఉన్నాయి.అంతేగాక చవకగా కూడా ఉన్నాయి.దాంతో అవి బాగా అమ్ముడయ్యాయి.మంచి లాభాలు వచ్చాయి.ఆ డబ్బుతో ఇంకో రెండు ఫ్యాక్టరీలు తెరిచాడు.ఒకటి మగవారి కోసం,ఇంకొకటి ఆడవారి కోసం. అతడి మూలంగా ఎంతో మందికి బతుకు తెరువు దొరికింది.ఆ నగరం మరింతగా పెరిగింది. జేసుదాసు పేదపిల్లల కోసం ఓ బడిని కట్టాడు.టీచర్లను పెట్టాడు.ఒక ఆసుపత్రి కూడా కట్టించాడు,ప్రతి రోజూ ఎంతో మంది ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొంటున్నారు. జేసుదాసు అక్క ఎప్పుడో చనిపోయింది.సరైన తిండి,వైద్యం లేక ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు.మిగతా ఐదుగురూ దారీతెన్నూ లేక అలమటిస్తున్నారు.జేసుదాసు వారందరి బాధ్యతను తీసుకున్నాడు.వారికి పని కల్పించాడు.పెళ్ళిళ్ళు చేసాడు. జేసుదాసు ఇప్పుడెంతో ధనవంతుడు.అయినా ఆడంబరం లేకుండా జీవిస్తున్నాడు.చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు ఉంచుకొంటాడు.కష్టాల్లో ఉన్న పేదలకు వాటిని పంచి పెడతాడు.అందరితో ప్రేమగా మాట్లాడతాడు.ఫాదర్ దేవదానం లాగే అపారమైన దయను చూపిస్తాడు. అతడి గొప్పతనం ఏమిటో అందరికీ తెలిసింది.అతని కీర్తి ఆ నోటా ఈ నోటా పాకింది.చివరకు ఫ్రాన్సు దేశపు చక్రవర్తి దాకా వెళ్ళింది. చక్రవర్తి అతడ్ని నగరానికి 'మేయర్' గా చేసాడు.మేయర్ జేసుదాసు పేరు దేశమంతా తెలిసింది.దేశమంతా అతడ్ని పొగిడింది.ప్రభుత్వం అప్పగించిన పనిని కూడా అతను ఎంతో చక్కగా చేసాడు.మేయర్ గా కూడా ప్రజలకు అనేక సేవలు చేసాడు.ప్రేమ,సేవలకు మారు పేరయ్యాడు. అప్పుడప్పుడు ఫాదర్ దేవదానం గార్ని తలచుకుని కన్నీళ్ళు పెట్టుకొనేవాడు. పసితనం నుంచీ తాను కష్టాలు పడ్డాడు.చిన్నప్పుడే అమ్మానాన్న పోయారు.ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసు నుంచే కట్టెలు కొట్టే పనికి వెళ్ళాడు.అక్క పిల్లలకు తిండి లేదని-ఒక చిన్న రొట్టె ముక్క దొంగిలించాడు.ఆ రొట్టెను దొంగిలించిన పాపానికి పంతొమ్మిదేళ్ళు జైళ్ళో పడేసారు.బానిసలా పని చేయించుకున్నారు.చివరకు జైలు నుంచి బయటకొచ్చాడు.అప్పుడు ఒక్కరూ తనను చేరదీయలేదు.తినడానికి ఇంత తిండి పెట్టలేదు.తరిమి తరిమి కొట్టారు.అందరూ తనను ఛీ అన్నవాళ్ళే. అలాంటి సమయంలో ఫాదర్ తనను చేరదీసాడు.కడుపు నిండా అన్నం పెట్టాడు.పడుకోడానికి పక్క వేసాడు.అయినా మనుషుల మీద ద్వేషంతో తాను తిన్నింటి వాసాలే లెక్కపెట్టాడు.ఆయన ఇంట్లోనే దొంగతనం చేసాడు.అప్పటికీ ఫాదర్ తనను క్షమించాడు.ఆయన ప్రేమతో తనను వెక్కి వెక్కి ఏడ్చేలా చేసాడు.తను పూర్తిగా మారిపోయేలా చేసాడు.తనకు ఓ కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇదంతా తలచుకొని జేసుదాసు కన్నీళ్ళు పెట్టుకొనేవాడు.ఒకవేళ ఫాదర్ దేవదానం కలవకపోతే? అలాంటి మంచి మనిషి తనను చేరదీయకపోతే? తాను ఏమైపోయేవాడో? ఎంత దుర్మార్గుడిగా మారేవాడో! ఎన్నెన్ని దొంగతనాలు చేసేవాడో? చివరికి హత్యలక్కూడా పల్పడేవాడో ఏమో! ఒక్క రొట్టె ముక్క కోసం,పసిపిల్లల కడుపు నింపడం కోసం తను దొంగగా మారాడు.దరిద్రమే తనను దొంగగా మార్చింది.అయినా జనం దాన్ని గుర్తించలేదు.దేవదానం దయ వల్ల తనకిప్పుడు కష్టాలు లేవు.అందుకే ఇప్పుడు మంచి మనిషయ్యాడు.కష్టాలు కన్నీళ్ళు లేకుంటే మనుషులందరూ మంచివాళ్ళే గదా!మరి లోకం దీని ఎందుకు గుర్తించదు? లోకమంతా దేవదానంలా ఉంటే ఎంత బాగుంటుంది.దేవదానంలా ఆలోచిస్తే ఎంత బావుణ్ణు?జేసుదాసు మాటిమాటికీ ఇలా అనుకునేవాడు. ఎవరో అన్న మాట నిజమే.ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది.బతుకుల్ని బాగు చేస్తుంది.అందుకే లోకంలో అందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమతోను,దయతోను ఉండాలి.

				ఒక తాగుబోతు కథ

రంగయ్య ఓ చిన్న రైతు.ఉండేది వెంకటాపురం.ఇల్లు,రెండకరాల పొలం ఉన్నాయి.కష్టపడి పని చేస్తాడు.అతడి భార్య కూడా తెలివైనదే.పేరు లక్ష్మి. రంగయ్య ఐదో తరగతి దాకా చదువుకున్నాడు.లక్ష్మికి కూడా చదవడం,రాయడం వచ్చు.ఇద్దరూ పాలూ నీళ్ళలా కలిసిపోయారు.చక్కగా సంసారం చేస్తున్నారు.ఊళ్ళో అందరికీ ఈ ఆలుమగలంటే ఇష్టం. రంగయ్య సాదాసీదాగా ఉంటాడు.ఎలాంటి డాంబికాలకు పోడు.అబద్దాలు ఆడే అలవాటు అసలే లేదు.అప్పుడప్పుడు దేవుడ్ని తలచుకుంటాడు.ఎవరికైనా కష్టం వస్తే,ఎంతో కొంత సాయం చేస్తాడు. రంగయ్య కొడుకు ముద్దుగా,బొద్దుగా ఉంటాడు.బాగా అల్లరి చేస్తాడు.వాడంటే ఇద్దరికీ ప్రాణం.అందుకే వాడిని గారాబంగా చూసుకుంటున్నారు.ఇంకొక్క బిడ్డ పుడితే చాలు.ఐతే ఈసారి మగబిడ్డ వద్దు.ఆడపిల్ల పుట్టాలి.అదయ్యాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటారు. మనం ఎన్నయినా అనుకుంటాం.అన్నీ మనం అనుకున్నట్లు కావుగా,ఒక్కొక్కసారి అవుతాయి.ఒక్కొక్కసారి కావు.దాచుకున్న పాలు,పెరుగు పిల్లి తాగేస్తుంది.పాలిచ్చే పాడి గోవు ఉన్నట్టుండి చనిపోతుంది. ఒకనాడు- పిల్లాడికి విరోచనాలు పట్టుకున్నాయి.రంగయ్యకి కొంచెం వైద్యం వచ్చు.తెలిసిన మందు తెచ్చి కొడుక్కి వేసాడు.అయినా వాడికి నయం కాలేదు.పైగా వాంతులు కూడా మొదలయ్యాయి.వాంతులు,విరోచనాలతో రెండు గంటల్లోనే బాగా నీరసించిపోయాడు. లక్ష్మికి గాబరా పట్టుకొంది.బోరున ఏడ్వడం మొదలెట్టింది.ఏ అమ్మైనా అంతేగా.తన బిడ్డ కష్టపడుతుంటే బేజారెత్తిపోతుంది.రంగయ్యకు భయం వేసింది. “బిడ్డను పట్నం తీసుకుపొండి.పెద్దాస్పత్రిలో చూపించండి” అన్నారు ఇరుగూ పొరుగూ.ఇక తప్పుతుందా. ఇద్దరూ కొడుకుని తీసుకుని బస్టాండులో నిలబడ్డారు.వెంకటాపురం నుంచి పట్నానికి ఒకటి రెండు బస్సులున్నాయి.ఐతే రెండు గంటలు చూసినా బస్సు జాడ లేదు.ఒక బస్సూ రాలేదు,పోలేదు. పట్నంలో అల్లర్లు అవుతున్నాయట.అక్కడ కర్ఫ్యూ పెట్టారు.కనిపిస్తే కాల్చివేస్తారట.అందుకే బస్సులు రావడం లేదని ఎవరో చెప్పారు.ఇద్దరికీ గుండెల్లో రాయి పడింది.ఇప్పుడెలా? ఏం చేయాలి? బిడ్డను ఎక్కడికి తీసుకుపోవాలి? వారిద్దరూ అంతో ఇంతో చదువుకున్నారు.అయినా వాళ్ళు డాక్టర్లు కారుగా.పాపం వాళ్ళకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. పట్నంలో అల్లర్లయితే ఊరి వాళ్ళకూ కష్టమే.అందరికీ కష్టమే.దారంట పోయేవాళ్ళ కాళ్ళా వేళ్ళా పడి పట్నం చేరుకున్నారు.పోలీసుల సాయంతో పెద్దాసుపత్రి చేరుకున్నారు.అప్పటికే ఆలస్యం అయింది.పువ్వులాంటి బిడ్డ పరలోకానికి చేరుకున్నాడు.వాడిని కాపాడాలని డాక్టర్లు ఎంతగానో చూసారు.అయినా లాభం లేకపోయింది. పిల్లాడు చనిపోయాడు! ఇంకేముంది.రంగయ్య నవ్వడం మరిచిపోయాడు.తిండి తిప్పలు మానేసాడు.పొలానికి పోతే అక్కడే ఉండిపోతాడు.ఇంటికి వస్తే పొలం ఉందన్న సంగతి మరచిపోతాడు.ఎక్కడ కూచుంటే అక్కడే.లోకంతో పని లేనట్టు తయారయ్యాడు. పాపం,లక్ష్మి కూడా ఏడ్చి ఏడ్చి మనిషి సగమైపోయింది.ఊరివాళ్ళు ఇద్దరికీ ఎంతో నచ్చచెప్పారు.పిల్లాడిని మరిచిపోమని అన్నారు.ఇది ఎవరికైనా తప్పదని అన్నారు.అయినా పిల్లాడు పోయిన బాధ ఇద్దరినీ తినేస్తోంది.లోలోనే కుమిలిపొతున్నారు.కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. ఒకనాడు రంగయ్య పొలంలో ఉన్నాడు.ఊరికే ఆకాశం వంక చూస్తూ ఉండిపోయాడు.ఇంతలో జమిలయ్య అక్కడికి వచ్చాడు.అతడు రంగయ్యకు చిన్నాన్న అవుతాడు.దూరపు చుట్టరికం.అతడో పచ్చి తిరుగుబోతు.తాగుడుకి బానిసగా మారి పొలం అమ్ముకున్నాడు.ఎద్దులు,నాగలి కూడా అమ్ముకున్నాడు.పెళ్ళాన్ని కొడితే చేతులు విరగ్గొట్టింది.విసుగెత్తి అతడ్ని వదిలేసింది. జమిలయ్యకు అంత పెద్ద చరిత్ర ఉంది.ఇప్పుడు ఆ జమిలయ్య రంగయ్య దగ్గరకు వచ్చాడు. “ఒరే రంగా.ఇప్పుడేం కొంప మునిగిందిరా.నీ వయసేం అయిపోలేదు.ముందుముందు కావలసినంత మంది పుడతారు.ఒక్క పిల్లాడి కోసం ఇలా అయిపోతావా? మర్చిపో.ఇదిగో ఓ చుక్క సారా వేసుకో.ఇదేసుకుంటే అన్నీ మర్చిపోతావు” అన్నాడు. రంగయ్య ఎన్నడూ సారా తాగింది లేదు.కనీసం బీడీ కూడా అలవాటు లేదు.పిల్లాడు పోయిన దు:ఖంలో బుర్ర పని చేయడం లేదు.ఉలుకూ పలుకూ లేకుండా ఊరుకున్నాడు. జమిలయ్య మళ్ళీ చెప్పాడు.మళ్ళీ మళ్లీ చెప్పాడు.సారా తాగితే ఎన్ని లాభాలో ఊదరగొట్టాడు.ఎంత భాధనైనా మర్చిపోతావని ఊరించాడు. రంగయ్య నమ్మాడు.జమిలయ్య చెప్పినట్టే సారా తాగాడు.ఎకాఎకి ఒక సీసాడు తాగాడు.నిషా ఎక్కింది.దాంతో బాగా ఏడ్చాడు.నవ్వాడు.చివరకు పొలంలోనే పడి నిద్రపోయాడు. ఆరోజు నుంచి అతనికి శనిపట్టింది. తాగి పడుకున్నాడుగా.తిరిగి లేచేసరికి రాత్రయింది.ఎక్కిన మత్తు ఇంకా దిగలేదు.మెల్లగా ఊళ్ళోకి వచ్చాడు.తనకు తెలీకుండానే సరాసరి సారా అంగడిలోకి దూరాడు.ఇంకో సీసా పట్టించాడు.తూలు కుంటూ ఇల్లు చేరాడు.ఇంట్లోకి పోతూ పోతూ తూలి పడ్డాడు.మూతి పగిలింది. పక్కరోజు జమిలయ్య ఇంటికొచ్చాడు.రంగయ్య పగిలిన మూతిని చాశాడు.“దీనికి ఒకటే మందు” అన్నాడు.రంగయ్యను సారా అంగడికి తీసుకెళ్ళాడు. ఇద్దరూ సారా కొనుక్కొని పొలానికి వెళ్ళారు.అక్కడ కూచుని రోజంతా తాగారు.ఇక ఆ తర్వాత రోజూ ఇదే కథ.రంగయ్యకు తాగడం తప్పించి మరో పని లేదు.అదే బతుకయ్యింది. జమిలయ్యతో పాటూ మరో ఇద్దరు ముగ్గురు పనికిమాలిన వాళ్లు తయ్యరయ్యారు.అందరూ కలిసి రంగయ్యను పీకల దాకా తాగిస్తారు.రంగయ్యకు ఎక్కడి డబ్బులూ చాలడం లేదు. పనికిమాలిన తాగుబోతువెధవలు రంగయ్యతో పొలం అమ్మించారు.ఆ డబ్బులన్నీ తాగుడికే అయిపోయాయి.లక్ష్మి నగలు కూడా అమ్మేసాడు.అవీ తాగుడికే.ఒకనాడు ఆ సన్నాసులంతా నూరిపోసారు - ఇల్లు తాకట్టు పెట్టమని.రంగయ్య మరో ఆలోచన లేకుండా పెట్టేసాడు.రెండు వారాల్లో ఆ సొమ్ము కూడా ఆవిరయింది. లక్ష్మికి బాగా జబ్బు చేసింది.ఇల్లు గడవడం కష్టంగా ఉంది.ఆలుమగల్లో ఎవరికీ పైసా సంపాదన లేదు.రంగయ్య పని చేయడం ఎప్పుడో మానుకున్నాడు.ఉన్నవన్నీ అమ్మిపడేసాడు.ఇంటి నిండా దరిద్రమే.తినడానికి తిండి కూడా కరువయింది. ఒకనాడు రంగయ్యకు తాగుడు నిషా మరీ ఎక్కువయింది.సరిగ్గా అప్పుడే జమిలయ్యతో తగువు పడ్డాడు.కట్టె తీసుకొని అతడి బుర్ర పగలగొట్టాడు.దాంతో అతగాడు పోలీసు కేసు పెట్టాడు.పోలీసులు రంగయ్యను ఈడ్చుకెళ్ళారు.రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు.లక్ష్మి జబ్బుతో,ఆకలితో సొమ్మసిల్లింది. మూడో రోజు రంగయ్య ఇంటి కొచ్చాడు.పొరుగువాళ్ళు కొన్ని నూకలు అప్పు ఇచ్చారు.వాటితో జావ కాచుకుని ఇద్దరూ తాగారు. “నేను మళ్ళీ తల్లిని అవుతున్నానయ్య” అంది లక్ష్మి.తాగుడు మానేయమని బతిమాలింది.నిజానికి ప్రతిరోజూ అతడికి చెబుతూనే ఉంది.రేపు పిల్లాడో పిల్లో పుడితే వాడికి ఏం పెడతాం? అంది.ఎన్నో రకాలుగా నచ్చచెప్పింది. రంగయ్య అన్నీ విన్నాడు.లక్ష్మి చెప్పింది న్యాయమే అన్పించింది.“ఈ రోజు నుంచి ఇక చచ్చినా సారా తాగను” అన్నాడు. పెళ్ళాం మీద ఒట్టేసాడు. పొద్దు గూకింది.ఇలా చీకటిపడిందో లేదో అలా రంగయ్య మనసు మారింది. “ఇప్పుడు నా దగ్గర ఏం మిగిలాయి? పొలం పోయింది.పంట పోయింది.ఇల్లా తాకట్టులోవుంది.పెళ్ళాం నగలతో పాటు అన్నీ పోయాయి.చేతిలో చిల్లిగవ్వ లేదు.ఇలాంటి బతుకు బతికే కంటే చచ్చిపోవడం మంచిది” అనుకున్నాడు. ఐతే అనుకున్నట్టుగా అతను చావలేదు.సారా దుకాణంలోకి దూరాడు.అప్పు అడుక్కొని మరీ తాగాడు. తాగి తాగి తూలుతూ ఇంటికొచ్చాడు.లక్ష్మి మంచం మీద పడి ఉంది.లేవమని అరిచాడు.చిందులేసాడు.ఆమెను లేపాలని పిచ్చిపిచ్చిగా కేకలేసాడు. ఏం జరిగిందో అనుకుంటూ ఇరుగూ పొరుగూ వచ్చారు.చూస్తే ఇంకేముంది? లక్ష్మి చనిపోయి ఉంది! రంగయ్య నమ్మలేదు.తాగుడు మత్తులో ఉన్నాడుగా.ఎలా నమ్ముతాడు.పైగా ఆ మాటలన్న వారితో జగడం వేసుకున్నాడు.అంతా కలిసి నాలుగు తన్నారు.అప్పటికి గాని మత్తు దిగలేదు. ఇప్పుడు దిగితే ఏం లాభం? లక్ష్మి చనిపోయింది! ఆమె తిరిగి రాదుగా.రంగయ్య ఘొల్లుమని ఏడ్చాడు. 'వీడు ఎంత ఏడిస్తే ఏం లాభం? లక్ష్మి రాదుగా,ఉత్తుత్తినే ఏడుస్తున్నాడు.నాటకాలాడు తున్నాడు!' అనుకున్నారు జనం. లక్ష్మి పోయాక రంగయ్య పట్టుమని పది దినాలు కూడా ఆగలేదు .ఇంటిని అమ్మేసాడు.పగలూ,రాత్రీ తాగుతూనే గడిపాడు.ఇల్లమ్మిన డబ్బులు లుంగీకి కట్టుకున్నాడు. ఏ హోటల్లోనో ఇంత తింటాడు.ఒకనాడు బస్టాండులో పడుకుంటాడు.మరోనాడు బజారులో నిద్రపోతాడు.ఒకోసారి తాగి రాత్రంతా రోడ్డు మీదే పడి ఉంటాడు. ఒకనాడు బాగా తాగి కాలువ ఒడ్డున పడిపోయాడు.లుంగీకి కట్టిన డబ్బులు ఎవడో ఎత్తుకుపోయాడు. ఇంకేముంది.ఇప్పుడు రంగయ్య అసలుసిసలు బికారిగా మారాడు.ఊరు విడిచిపెట్టాడు.బిచ్చగాడిగా మారిపోయాడు.ఊరి నుంచి ఊరికి బిచ్చమెత్తుకుంటూ తిరుగుతున్నాడు.నాలుగు పైసలు బిచ్చమొస్తే చాలు.ఆ డబ్బుతో సారా తాగడమే.ఇల్లు,వాకిలి,ఊరు,పేరు ఏమీ లేని వాడయ్యాడు. ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది.అప్పుడు రంగయ్య అడవిలో ఉన్నాడు.పేరుకే అది అడవి.అందులో చెట్లన్నీ కొట్టేసారు.చెట్లు పోయాక ఇక అడవెక్కడిది. అయినా అందరూ దానిని అడివనే అంటారు. జోరుగా వాన కురిసింది.రంగయ్య పరిగెత్తాడు.తొందరగా ఏదో ఒక ఊరు చేరుదామని ఆరాటం.సారా కావాలిగా.అప్పటికే చీకటి పడింది.వాగులూ వంకలూ పొంగుతున్నాయి.మెరుపులు మెరిస్తేనే దారి కనిపిస్తుంది.ఎటు పోతున్నాడో రంగయ్యకే తెలీదు.అంతా అయోమయంగా ఉంది. ఉన్నట్టుండి ఒక వాగులో పడిపోయాడు.బాగా భయపడ్డాడు.మోకాలుకి దెబ్బ తగిలింది.బిగ్గరగా అరిచాడు. వాగు దగ్గర ఒక సాధువు ఉంటున్నాడు.రంగయ్య కేకలను విని అక్కడికి వచ్చాడు.అతడ్ని కాలువలోంచి పైకి తీసాడు. అయితేరంగయ్య నిలబడలేకపోతున్నాడు.అందుకని మోసుకుంటూ కుటీరానికి తీసుకుపోయాడు. రంగయ్య మోకాలుకి పెద్ద దెబ్బే తగిలింది.చాలా రోజులు మంచం పట్టాడు.నయం కావడానికి నెలరోజులు పైగా పట్టింది.అన్నినాళ్ళూ అక్కడే ఉన్నాడు.సాధువే అతనికి తిండి పెట్టాడు.ఆకు మందులూ అవీ తినిపించాడు. ఈ నెల రోజులూ రంగయ్య తాగలేదు.ఐనా ఎలా తాగుతాడు.మంచం దిగడానికి వీలు కాదు.ఇంకెలా తాగుతాడు.ఎక్కడ తాగుతాడు. సాధువు బిచ్చమెత్తుకొని వస్తాడు.అన్నం వండి తనింత తింటాడు.రంగయ్యకు ఇంత పెడ్తాడు. రంగయ్య మల్లమెల్లగా లేచి నడుస్తున్నాడు.చిన్న చిన్న పనులు చేస్తున్నాడు.ఒకనాడు సాధువుకి కథంతా చెప్పుకున్నాడు.చెప్పి భోరుమని ఏడ్చాడు. సాధువు ఓపిగ్గా విన్నాడు. “నాయనా! తాగుడు అలవాటు చేసుకొని ఎంత తప్పు చేశావు.సర్వనాశనం అయ్యావు.ముందు వెనుకలు ఆలోచించలేదు.ఇల్లు,పొలం,నగలూ అన్నీ పోగొట్టుకున్నావు.బంగారం లాంటి భార్య చనిపోయింది.తాగుడు నిన్నే కాదు.నీ సంసారాన్ని కూడా గుల్ల చేస్తుంది.పాపం లక్ష్మి ఏం పాపం చేసిందని.అన్యాయంగా చనిపోయింది.నీ తాగుడికి ఆమె బలైపోయింది” అన్నాడు. రంగయ్య భార్యను తలచుకొని ఏడ్చాడు. “సరే.జరిగిందేదో జరిగింది.ఇప్పుడైనా నీ తప్పును సరిదిద్దుకో.ఇకపై తాగుడు జోలికి పోకు.దాని ఊసే ఎత్తకు.నువ్వు ముసలివాడివైపోలేదు.నీ వంట్లో ఇంకా బలం ఉంది.పో,పోయి కష్టపడు.” “నువ్వు రైతు బిడ్డవి.ఎంత కష్టమైనా పడగలవు.కష్టపడి నాలుగు డబ్బులు కూడబెట్టు.మళ్ళీ పొలం కొనుక్కో.మళ్ళీ ఇల్లు కట్టుకో.అందరికీ మంచి చెయ్యి.అందరినీ ప్రేమగా చూడు.కష్టపడి బతుకు.చెడు అలవాట్లకు దూరంగా ఉండు.అప్పుడు అందరూ నీకు సాయం చేస్తారు.మళ్ళీ అందరూ నిన్ను గౌరవంగా చూస్తారు” అని సాధువు నచ్చచెప్పాడు. రంగయ్య తిరిగి తన ఊరికి వచ్చాడు. ఊరి వాళ్ళని కలిసాడు.జరిగినదంతా చెప్పాడు.అందరూ ఒకటే అన్నారు - “తప్పుడు పనులు చెయ్యకుండా ఉంటే సాయం చేస్తాం.” “నీ పొలం నువ్వే సాగు చేసుకో.కష్టం చేసి నా బాకీ తీర్చు.ఐతే సారా తాగి చిందులేస్తే ఊరుకోను” అన్నాదు పొలం కొన్నాయన. ఇది జరిగి ఓ పదేళ్ళు గడిచాయి. రంగయ్య బాగా కష్టం చేసాడు.పైసలు కూడబెట్టాడు.పొలం సొంతం చేసుకున్నాడు.అందరూ నచ్చజెపితే మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు రంగయ్యను చూసినవారంతా ఒకటే అంటారు.“ఏం తాగేవాడు.ఎంత తాగేవాడు.ఈ మనిషి బాగుపడతాడని మేం కలలో కూడా అనుకోలేదు” “నేను చేసిన తప్పు ఒకటే.తాగుడికి బానిస కావడం.అది అలవాటయ్యాక తాగకపోతే నాకు ఏమీ తోచేది కాదు.పిచ్చెక్కినట్లుండేది.నెలరోజులు మంచం పట్టి తాగకుండానే బతికాను.అప్పుడు నాకు అన్పించింది - తాగుడు లేకుండా అంతకు ముందు చక్కగా బతికాను.ఇప్పుడు మాత్రం ఎందుకు బతకలేను?” అని. అంతే అప్పటి నుంచి తాగడం మనేసాను“ అంటాడు రంగయ్య. అంతే కాదు.మరో మంచి మాట కూడా చెబుతాడు. “నేను ఎలా మానగలిగానో - అలాగే అందరూ మానగలరు.”

మంచి_మనిషి.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)