User Tools

Site Tools


అమ్మ_ఒడి
				అమ్మ ఒడి
బడిలో పరీక్షలు అయిపోయాయి.రెండు నెలలు సెలవులిచ్చారు.పిల్లకాయలు ఎగిరి గంతేశారు.వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు.గట్టు తెగిన చెరువులా ఊరి మీద పడ్డారు.ఒకటే అల్లరీ,అరుపులూ.ఊరు వాడా ఏకం చేస్తున్నారు.
ఆ ఊళ్ళో పిల్లలకి - బడికీ జైలుకీ తేడా లేదు.బళ్ళో టీచర్లు ఏమోమో చెబుతుంటారు.అదేమీ అర్ధమై చావదు.టీచర్ల లోకం టీచర్లది.పిల్లల లోకంపిల్లలది.ఎంతసేపూ"చదవండ్రా,చదవండ్రా"అంటారు.చదవకపోతె చావగొడతారు.గోడ కుర్చీ వేయిస్తారు.వేడి ఇసుకలో మోకాళ్ళ మీద నిలబెడతారు.ఎన్ని చేసినా అక్షరం ముక్క వస్తే ఒట్టు.పిల్లలకి బడి గంట మీదే లోకువ.రెండు నెలల సెలవులంటే మాటలా? ఎంత సంబరంగా వుంటుంది! ఇంతకంటె పండగ మరేముంటుంది?
పిల్లలు గోలగోల చేస్తున్నారు.కేరింతలు కొడుతూ ఊరంతా తిరుగుతున్నారు.వాళ్ళలో రంగడు కూడా ఉన్నాడు.ఆ ఊళ్ళో అల్లరి పిల్లలందరికీ వాడే నాయకుడు.బడిలో టీచర్లు వాడ్ని రోజూ చావగొడుతుంటారు.అయినా వాడికి ముప్పై కంటే ఎక్కువ మార్కులు రావు.ఎలాగో తంటాలు పడి ఒక్కో తరగతి పాసవుతున్నాడు.ఇప్పుడు ఏడులోకి వచ్చాడు.ఇక ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతాడో ఏమో! 
రంగడికి చదువైతే అబ్బలేదు.కాని అల్లరిలో మాత్రం వాడికి వాడే పోటీ.రోజు కొకరైనా వాళ్ళమ్మ దగ్గరికి రావల్సిందే.రంగదడిమీద ఎదో ఒకతటి చెప్పాల్సిందే.వాళ్ళమ్మకు వాటితో తల బొప్పి కడుతోంది.

“మీవాడు మా అబ్బాయిని నెత్తురు కారేలా గిచ్చాడు.” “మా బిడ్డను కాలువలో ముంచేశాడు.ఏడి వాడు?” “మా అమ్మాయి గౌనుకు పేడ పూసాడు.” “మా వాడ్ని రాయితో కొట్టాడు.” ఇలా పూటకొక గొడవ తెస్తాడు.

ఒకసారి రంగడు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు.అటుగా పోతున్న ఓ పెద్దాయన-"బుద్ధిగా చదువు కోరాదట్రా.ఇలా అడ్డగాడిదలా ఎందుకు తిరుగున్నావురా?" అన్నాడు.అంతే.మరునాడు గోడ చాటు నుంచి రంగడు రాయి విసిరాడు.పాపం ఆ పెద్దాయన మాడు పగిలింది.
ఈ సమంగతి రంగడి అమ్మకు తెలిసింది.ఆమె వాడ్ని చితకబాదింది.చివరకు"అబ్బబ్బా!ఇక నీ ఆగడాలు నేను భరించలేనురా.సిగ్గు లేదట్రా?దీనికంటె చావరాదట్రా. చచ్చి మీ నాన్న సుఖపడ్దాడురా. నీ ఆగడాలతో వేగలేక నెను చతస్తున్నా." అంటూ పెద్దగా ఏడ్ఛింది.
ఆమెకు కడుపు మండినప్పుడు అలాగే ఏడ్చేది.అప్పుడు మాత్రం రంగడు తలొంచుకొనేవాడు.పాపం వాడి నాన్న చనిపోయాడు.
నాన్నను తలచుకొని అమ్మ ఏడిస్తే వాడు తట్టుకోలేక పొయ్యేవాడు.చప్పుడు చేయకుండా ఓ మూల కూచునేవాడు.ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు.అయితే అది ఎంత సేపని.ఓ గంట మాత్రమే అలా ఉండేవాడు.ఈలోగా కిష్టయ్యతో తగాదా వచ్చేది.
కిష్టయ్య అంటే రంగడి తమ్ముడు.వాడు ఎప్పుడూ చదువుకుంటూనే ఉంటాడు.క్లాసులో ఎప్పుడూ వాడే ఫస్టు.
అమ్మకు కిష్టయ్యంటే మహా ఇష్టం.రంగడికి వాడంటే మంట. 'ముచ్చుమొగం' అని తిడతాడు.బడి నుంచి కిష్టయ్య పరిగెత్తుకొని వస్తాడు.రంగడు చేసిన ఆగడాలు అమ్మకు చెపుతాడు.వాడు తిన్న దెబ్బలు కూడా అమ్మకు చెపుతాడు.ఇంకేముంది.అమ్మ వాకిటిలో నిలబడు తుంది.ఆమె చేతిలో కర్రో,చిపురుకట్టో ఉంటుంది.రంగడు బడినుండి రాగానే చావగొడుతుంది.కిష్టయ్య ఏమీ ఎరుగని చుప్పనాతిలా చూస్తాడు.అమ్మ వెనక దాక్కుంటాడు.అందుకే వాడంటే రంగడికి కోపం.
ఇప్పుడు బడికి సెలవలుగా! కుర్రకుంకలంతా మట్టిలో మకాం వేసేశారు.కాలవ గట్టున గోలగోలగా ఆడుకొంటున్నారు.
ఒకనాడు ఎక్కడి నుంచో ఓ పెద్దమనిషి వచ్చాడు.నడిచినడిచీ బాగా అలసిపోయి ఉన్నాడు."బాబూ!పులిచింత ఊరు ఇదేనా?" అని రంగడ్ని అడిగాడు.
రంగడు ఆయన వంక ఎగాదిగా చూశాడు.పిల్లల వంక తిరిగి కన్ను గీటాడు.
"ఇది కాదండి.కాలువకు అవతల దూరంగా కనిపిస్తుంది చూడండి.అదే పులిచింత."అన్నాడు పెద్దాయనతో.ఆయన రొప్పుకుంటూ అటు వైపు బయలుదేరాడు.నిజానికి పులిచింత రంగడి ఊరే.కావాలని అబద్ధం చెప్పాడు రంగడు.ఆ పెద్దమనిషి నమ్మాడు.ఆ దారినే పొయ్యాడు.ఆయన కొంచెం దూరం పోగానే అందరూ పగలబడి నవ్వారు."హేహే"అని అరుస్తూ గెంతులు వేశారు.
కిష్టయ్య పరుగు పరుగున ఇంటికి పోబోయాడు.రంగడు ముందుకు దూకి వాడ్ని పట్టుకున్నాడు."అమ్మకి చెప్పడానికేగా నువ్వు పరుగు పెడుతున్నావ్?"అని వాడి జుట్టు పట్టుకున్నాడు.
"లేదు.నేను నీళ్ళు తాగేందుకు పోతున్నా."అన్నాడు కిష్టయ్య.ఆ మాటల్ని రంగడు నమ్మలేదు."నాకు తెలుసులేరా.నువ్వెందుకు పోతున్నావో."అంటూ వాడ్ని నేల మీదకు తోశాడు.వాడు మట్టిలో వెల్లకిలా పడ్డాడు.అందరూ నవ్వారు.వాడికి అవమానంగా అనిపించింది.బాగా కోపం వచ్చింది."పోరా!పాలకోవా!"అన్నాడు ఉక్రోశంగా.
'పాలకోవా' అంటే రంగడికి చెడ్డకోపం. ఎందుకో తెలుసా?
ఒకరోజు వాళ్ళ పక్కింటి కుర్రాడు పాలకోవా తింటున్నాడు. రంగడు తనకు కొంచెం పెట్టమన్నాడు. వాడు అందుకు ఒప్పుకోలేదు. అంతే వాడి చేతినుంచి పాలకోవా లాక్కున్నాడు. గుటుక్కున మింగేశాడు. వాడు అరిచి గీపెట్టాడు.ఆరోజు రంగడు అమ్మచేతిలో బాగా దెబ్బలు తిన్నాడు. అప్పటి నుంచి కిష్టయ్య రంగడిని 'పాలకోవా' అనేవాడు. ఎగతాళి చేసేవాడు. అందుకే కిష్టయ్య "పోరా పాలకోవా" అనగానే వాడికి బాగా కోపం వచ్చింది. కిష్టయ్యను ఎడాపెడా వాయించాడు. వాడి దెబ్బలకు కిష్టయ్య తెలివి తప్పాడు. అయినా వాడి కోపం తగ్గలేదు. గట్టిగా ఒక తన్ను తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
సాయంత్రమైంది. చీకటి పడసాగింది.అయినా రంగడు ఇంటికి పోలేదు. పోతే అమ్మ బడితే పూజ చేస్తుంది. కిష్టయ్య ఈపాటికి అన్నీ చెప్పేసి ఉంటాడు.మిగతా పిల్లలు కూడా సాక్షం పలికి ఉంటారు. అమ్మ తనను చావబాదడం ఖాయం! అయినా అంత మంది పిల్లల ముందు కిష్టయ్య తనను వెక్కిరించొచ్చా? వాడు 'పాలకోవా' అన్నాడనేగా తనకు కోపం వచ్చింది. అయినాసరే అమ్మ వాడినేమీ అనదు. తననే తప్పు పడుతుంది. ముంగిలిముచ్చి వెధవ. ఏమైనాసరే ఈరోజు ఇంటికి వెళ్ళకూడదు-అనుకున్నాడు. ఒక గుడి వరండాలో పడుకొన్నాడు.

కాని ఎంతసేపని వాడు గుడిలో పడుకోగలడు. కడుపులో ఆకలి దంచేస్తోంది. తట్టుకోలేక పోయాడు.'ఏమైతే అది అయ్యింది' అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు.

భయపడుతూనే ఇంటికి చేరాడు.పిల్లిలాగా ఇంట్లోకి అడుగుపెట్టాడు.మాంసం కూర వాసన కమ్మగా తగిలింది.అరె! ఇదేమిటి! పండగ లేనిదే అమ్మ మాంసం కూర వండదే.ఈ రోజు ఏ పండగా లేదే! ఆశ్చర్యపోతూ అటూఇటూ చూశాడు.
అమ్మ వాడి చేతిని గట్టిగా పట్టుకుంది.మరో చేత్తో చీపురుకట్ట తీసుకుంది."పసివాడ్ని గొడ్డును బాదినట్టు బాదుతావురా!" అని కోపంగా అంది.చీపురుతో బాగా వాయించబోయింది.ఇంతలో ఓ పెద్దాయన అక్కడికి వచ్చాడు."పోన్లే చెల్లెమ్మా.ఈ ఒక్కసారికి వదిలేసెయ్" అంటూ అమ్మ చేతిని పట్టుకున్నాడు.
ఆ పెద్దాయన ఎవరో కాదు."పులిచింత ఇదేనా బాబూ?" అని అడిగినాయన!
రంగడి మేనమామ.హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు.రాకపోకలు అంతగా లేవు.అందుకే రంగడు గుర్తు పట్టలేకపోయాడు.ఆయనా రంగడిని గుర్తు పట్టలేకపోయాడు.
మేనమామ పుణ్యం.రంగడికి ఆపూట దెబ్బలు తప్పాయి.కడుపునిండా తిని హాయిగా పడుకున్నాడు.ఉదయం లేచేసరికి అంతా హడావుడిగా ఉంది.
మామయ్య ఊరికి పోవడానికి తయారవుతున్నాడు."తొందరగా తయారవ్వు.నువ్వు కూడా మీ మామయ్యతో వెళ్ళాలి."అంది అమ్మ.రంగడు అయోమయంగా చూశాడు.వాడికి వెల్లాలనీ ఉంది. వెళ్ళొద్దనీ ఉంది. ఏమీ తోచలేదు. అమ్మ చెప్పినట్టే చేశాడు. గబగబా తయారయ్యాడు.
ముందురోజు రాత్రి ఒక సంగతి జరిగింది.రంగడి అమ్మ తన అన్నయ్యతో అన్నీ చెప్పింది.రంగడి ఆగడాల గురించి చెప్పింది.
"నువ్వేమీ బాధ పడకమ్మా.వాడి సంగతి నాకు వదిలేసెయ్.ఇక నుంచి వాడి బరువు నేను తీసుకుంటాను.
రేపు నాతో పాటు వాడ్ని కూడా తీసుకెళ్తాను.నా దగ్గరే ఉంచుకొని చదివిస్తాను."అన్నాడు రంగడి మేనమామ.అమ్మ మనసు తేలికపడింది."ఇంతకంటే ఏంకావాలి"అనుకుంది.రంగడు లేకుండా తాను బతగ్గలదా?అయినా తప్పలేదు.బాధ పడుతూనే వాడ్ని పంపించింది.
మామయ్యతో కలిసి రంగడు హైదరాబాద్ బయలుదేరాడు.
  • * *
హైదరాబాదులో అంతా కొత్తగా ఉంది.పొలాలు లేవు. చెరువులు లేవు. తోటలు లేవు. కాలువ గట్లు అంతకన్నా లేవు. ఎటు చూసినా ఇళ్ళే.పెద్ద పెద్ద మేడలు!ఆడుకోడాని చోటు లేదు. ఆడుకుందామన్నా స్నేహితులు లేరు.బిక్కుబిక్కు మంటూ రంగడు ఇంట్లొనే ఉండసాగాడు.
మామయ్య స్నేహితుడు ఒకాయన టీచరుగా పని చేస్తున్నాడు.ఆయన పని చేస్తున్న స్కూల్లో రంగడ్ని చేర్చారు.ఏడవ తరగతిలో చేరాడు. బడిలో కూడా ఆడుకోడానికి చోటు లేదు.
రంగడ్ని తీసుకురావడం వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదు.అందుకే ప్రతిదానికి వాడిని కసురుకుంటోంది.మాటిమాటికి వాడి మీద కేకలు వేస్తోంది."ఊళ్ళోనే అన్ని ఆగడాలు చేశాడు.ఇక్కడ ఇంకా ఏం చేస్తాడో!" అంది అత్తయ్య.
హైదరాబాదులో మంచినీళ్ళకి కటకటగా ఉంటుంది.వాళ్ళుంటున్న వీద్ధిలో మరీ ఎక్కువ.రెండ్రోజులకు ఒకసారి మంచినీళ్ళ లారీ వస్తుంది.కడవలు పట్టుకుని జనం లారీ వెనక పడతారు.ఒకర్నొకరు తోసుకుంటారు. 
రంగడి మీద నిళ్ళు తెచ్చే పని పడింది.వాడికి అది కష్టంగా ఉంది.ఆయినా చేయక తప్పలేదు.మెల్లమెల్లగా ఒక్కోపని వాడి మీద పడ్డాయి.ఇప్పుడు వాడు నీళ్ళు మోస్తున్నాడు.బట్టలుతుకుతాడు.బజారుకు పోయి సామాన్లు మోసుకొస్తాడు.అంట్లు కడుగుతాడు.ఇన్ని చేసినా అత్తయ్యకి సంతోషం లేదు.వాడిని ప్రతిరోజూ తిడుతుంది.
రంగడికి స్కూలు ఫీజు కట్టాలి.వాడికి బట్టలు కుట్టించాలి.పుస్తకాలు కొనాలి.జ్వరమొస్తే మందూ మాకూ ఇప్పించాలి.వీటన్నింతికి అత్తయ్య తిట్టిపోస్తోంది.'తాను దూర కంత లేదు.మెడకొక డోలూ'అంటూ మామయ్యను కూడా దెప్పి పొడుస్తోంది.
రంగడికి బాధగా ఉంది.తాను ఇన్ని పనులు చేస్తున్నాడు.అయినా అత్తయ్య ఎందుకు తిడుతుంది? వాడికేమీ అర్థం కాలేదు.ఈమధ్య మాటిమాటికి తలనెప్పి వస్తోంది.రాత్రి పూట నిద్ర పట్టడం లేదు.పనులన్నీ చేసి బడికి పోయేసరికి ఆలస్యమవుతోది.బడిలో రోజూ బెంచీ మీద నిలబెడుతున్నారు.పాఠాలు బుర్ర కెక్కడం లేదు.ఇంటికి పోగానే చదువుకోవాలనుకుంటాడు.కానీ అత్తయ్య పనులు చెబుతుంది.అవన్నీ అయ్యేసరికి బాగా పొద్దు పోతుంది.అప్పుడు చదువుకోవడానికి ఓపికుండదు.చవకుండానే తెల్లారి బడికి పోతున్నాడు.బడిలో అడిగింది చెప్పలేకపోతున్నాడు.రోజూ దెబ్బలు పడుతున్నాయి.
టీచరు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు."మీ పిల్లవాడు  సరిగ్గా చదవడం లేదు."అని ఫిర్యాదు చేస్తాడు.ఆ రోజు అత్తయ్య ఇంకో గంటసేపు రంగడ్ని తిడుతుంది.వాడు తల వంచుకుంటాడు.మూగవాడిలా నిలబడతాడు.లోలోపల కుమిలిపోతాడు. 
రాత్రిపూట రంగడు ఏడుస్తాడు.వాడికి ఊరు గుర్తొస్తుంది.అక్కడి స్నేహితులు గుర్తొస్తారు.అమ్మ, తమ్ముడు గుర్తొస్తారు.నిద్రపోతే కలలోనూ వాళ్ళే కనిపిస్తారు.వాడికి చాలా బెంగగా ఉంది."మామయ్యా! నన్నొకసారి ఊరికిపంపించవా!"అని దీనంగా అడుగుతాడు."సెలవులొచ్చాక వెళ్దువుగానీ." అంటాడు మామయ్య.
ఒకరోజు రంగడి లెక్కలు నోటుబుక్కు పోయింది. దానికోసం వాడు వెదకని చోటు లేదు. ఎంత వెదికినా లాభం లేకపోయింది.
"నోటుబుక్కు లేకుండా బడిలోకి రావద్దు" అని టీచరు అన్నాడు.
"నీ కోసం రోజుకో నోటుబుక్కు ఎక్కడ తేగలం.ఇక్కడేమన్నా డబ్బులు పోగేసి పెట్టామా. పో..పోయి ఆ బుక్కు ఎక్కడ పారేశావో వెదికి తీసుకురా."అని అత్తయ్య తెగేసిచెప్పింది.
పాపం రంగడికి దిక్కు తోచలేదు. ఎం చేయాలో తోచలేదు.అ రోజంతా దారిలో కూచుండి పోయాడు.సమయానికి మామయ్య కూడా ఊళ్ళో లేడు.
రెండు రోజుల తర్వాత మామయ్య వచ్చాడు.వస్తూ వస్తూ పిల్లలకి మిఠాయిలు తెచ్చాడు."రంగడు ఎక్కడ?" అని అడిగాడు."ఎక్కడ చచ్చాడో ఏమో.రెండు రోజులుగా ఇంటికి రాలేదు."అంది అత్తయ్య.

మామయ్య ఊరంతా వెదికాడు.చివరకు ఓ రోడ్డు పక్కన రంగడు కనిపించాడు.వాడి బట్టలు దుమ్ముకొట్టుకు పోయాయి.తెలివి తప్పి పడి ఉన్నాడు.జ్యరంతో వాడి వళ్ళు కాలిపోతోంది.పుస్తకాల సంచి వాడి పక్కనే ఉంది.“అమ్మా అమ్మా” అంటూ మూలుగుతున్నాడు.

ఆటోలో పడుకోబెట్టి రంగడ్ని ఇంటికి తీసుకొచ్చాడు.డాక్టర్ని పిలిచి చూపించారు.ఆయన సూదిమందు ఇచ్చాడు.ఇంకా చాలా మాత్రలు రాసి ఇచ్చాడు.మామయ్య అన్నిట్ని కొన్నాడు.రెండు వారాలు గడిచాయి.అప్పటికిగాని వాడి జ్యరం పూర్తిగా తగ్గలేదు.మనిషి సగానికి సగమైపపోయాడు.పూచిక పుల్లలా తయారయ్యాడు.
"అమ్మ కావాలి.తమ్ముడు కావాలి.ఇంటికి వెళ్తాను మామయ్య." అని ఏడ్చాడు.

“పోదువు లేరా.సెలవులు రానీ. ” అంటూ మామయ్య ఓదార్చాడు.రంగడు రోజులు లెక్క పెడుతున్నాడు.కన్ను మూసినా తెరచినా ఇల్లే గుర్తుకొస్తోది.

ఇంకొన్ని నెలలు గడిచాయి.పెద్ద పరీక్షలు అయిపోయాయి.బడికి ఎండాకాలపు సెలవులిచ్చారు.ఒక్కరోజు కూడా రంగడు ఉండలేకపోయ్యాడు.ఊరికి బయలుదేరాడు.
ఊళ్ళోకి అడుగుపెట్టగానే వాడికి ప్రాణం లేచి వచ్చింది.కళ్ళలో జివ్వున నీళ్ళు చిమ్మాయి.ఎంత మంచి ఊరు తనది!ఇలాంటి ఊరిని వదిలిపెట్టి పోయాడా తను!వాడికెందుకో ఏడుపు కట్టలు తెంచుకొంది.
రంగడు వచ్చేశాడు.ఈ సంగతి నిమిషాల్లో పాకింది.ఎక్కడెక్కడి పిల్లలూ వచ్చేసారు.ఎలాంటి రంగడు!అందర్ని ఊరంతా తిప్పే రంగడు.కాలువగట్లు ఎగిరించే రంగడు.చెట్టెక్కించే రంగడు.కొతికొమ్మచ్చి లాడించే రంగడు.రంగడుంటే చాలు.లోకమంతా వాళ్ళదే.అల్లరంతా వాళ్ళదే.అలాంటి రంగడు మళ్ళీ వచ్చేశాడు.మళ్ళీ ఊళ్ళో పిల్లలందరికీ పండగొచేసింది.
వచ్చిన రంగడు ఇంట్లోకి దూరాడు.అమ్మను వాటేసుకొన్నాడు.తమ్ముణ్ణి వాటేసుకున్నాడు.వాడేమీ మాటాడ్డంలేదు.ఇంట్లోంచి తల కూడా బయట పెట్టడం లేదు.తమ్ముణ్ణి వదలిపెట్టడం లేదు.
రాత్రిపూట రంగడు చిన్న బిడ్డలా అమ్మ ఒళ్ళో దూరిపోతున్నాడు.ఒక్కోసారి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.అమ్మ వాడి తల నిమురుతోంది.
"నా బంగారు కన్నా. నా చిట్టి తండ్రీ! నువ్వు బాగా చదవాలిరా. మీ నాన్న పేరు నిలబెట్టాలిరా. మీ తమ్ముణ్ణి చదివించాలిరా."అని కన్నీళ్ళతో అమ్మ చెబుతుంది.
రంగడికి మాత్రం ఓ సంగతి గుర్తుకొస్తుంది.తాను జ్యరంతో రోడ్డు మీద పడున్న సంగతి.బడిలో బెంచీ మీద నిలబెట్టే సంగతి.వాడి కళ్ళలో మళ్ళీ నిళ్ళు ఉబుకుతాయి.అమ్మకు ఏమేమో చెప్పాలనుకొంటాడు. చెప్పలేడు.అమ్మ ఒళ్ళో అలాగే తల పెట్టుకొంటాడు.మెల్లగా నిద్రలోకి జారుకొంటాడు. 
అమ్మ_ఒడి.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)