User Tools

Site Tools


చాదస్తపు_మొగుడు
				పాపం దేవుడు

ఒకసారి రామలింగడు పొరుగూళ్ళో వున్న పెద్ద చెల్ల్లెలిని చూడబోయాడు.భోజనాలు పూర్తయినాయి.అప్పుడు పెద్ద చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది. అన్నయ్యా నీవు చాలా గొప్పవాడివి.భక్తుడివి.నువ్వు చెపితే దేవుడు వింటాడు.ఈ ఏడు జొన్నపైరు వేసాము.బొత్తిగా వానలులేవు.పైరు ఎండిపోయేటట్టుంది. ఒక పెద్ద వాన కురిపించమని దేవుదిని ప్రార్థన చెయ్యవా? అని అడిగింది. రామలింగడు సరేనని చెప్పాదు.మంచి వాన కురిపించమని దేవుడిని ప్రార్థించాడు. పక్కరోజు చిన్న చెల్లెల్ని చూచి పోదామని వాళ్ళ ఊరికి పొయ్యాడు. ఆ రోజంతా అక్కడ్ ఉన్నాడు.ఆ రాత్రికి అన్నాలు తిని ఆరుబైట పడుకున్నారు. చిన్న చెల్లెలు రామలింగడిని ఒక కోరిక కోరింది.అన్నయ్యా! ఈ యేడు వరి పైరు వేశాము.బాగా పండింది.కోతకు వచ్చింది. రేపోమాపో కొయ్యాలి.పైన చూస్తే మబ్బులు మబ్బులుగా వుంది. మాసూలు అయ్యేదాకా వాన కురిపించవద్దని దేవుడిని ప్రార్థన చెయ్యవా? అని అడిగింది. రామలింగడు సరేనని చెప్పాడు.పది రోజుల దాకా వాన కురిపొంచవద్దని దేవుడిని ప్రార్థన చేశాడు. తామలింగడు లోలోపల నవ్వుకొన్నాడు.. పాపం దేవుడికి ఎన్ని తిప్పలొచ్చాయి అనుకున్నాడు.

			ఎవరి మొహం చెడ్డడి?

అనగా అనగా ఒక రాజు.ఆయన పొద్దునే నిద్రలేచాడు.ఒళ్ళు విరుచుకొన్నాడు..కళ్ళు నులుము కుంటూ కిటికీలో నుంచి బయతికి చూసాడు. ఒక బిచ్చగాడు అటు పోతూ వున్నాడు.వాడి చింపిరి గుడ్డలు చూచి రాజుకు ఒళ్ళు మండింది. దరిద్రపు గాడిద కొడుకు అనుకున్నాడు. ఇంతలో సర్రున గాలి వీచింది కిటికీ తలుపు టకీ మని రాజు తలకు తగిలింది.తలబొప్పి కట్టింది. రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. పొద్దున లేచి వీడి దరిద్రపు మొహం చూసాను. తలబొప్పి కట్టింది. ఇదంతా వీడివల్లనే జరిగింది. వీడిని వదిలిపెట్టగూడదు. వీడికి తగిన శిక్ష వెయ్యాలి అనుకున్నాడురాజు. వాడిని పట్టుకొని రమ్మని భటులను పంపించాడు. రాజు కొలువు తీరాదు. భటులు బిచ్చగాడిని పట్టి కొలువుకు తెచ్చారు. బిచ్చగాడిని చూచి రాజు ఇంతెత్తున ఎగిరాడు. మండిపడ్డాడు. నిద్ర లేస్తూనే వీడి దరిద్రపు మొహం చూసాను. న తల బొప్పి కట్టింది. వీడిని ఉరి తియ్యండి. తీసుకుపోండి అన్నాడు రాజు. భటులు బిచ్చ్గాడిని తీసుకొని పోవడానికి సిద్ధపడ్డారు. బిచ్చ్గాదు రాజుగారి మొహంలోకి చూచాడు. మహరాజా!చచిపోయే ముందు నాదొక చిన్న మనవి అన్నాడు. ఏమిటది! విన్నవించుకో! అన్నాడు రాజు అయ్యా!నా మొహం చూచి తమరికి తల బొప్పి కట్టింది. కాని నేను ఈ రోజు నిద్రలేచి ముందుగా మీ మొహం చూసాను. నాకు ఉరిశిక్ష పడింది. ఎవరిది దరిద్రపు మొహమో నాకు అర్థం కావడంలేదు అన్నాడు బిచ్చగాడు. పాపం రాజు మొహం వాడిపోయింది.

				కుక్క బతుకు

పిండారబోసినట్టు వెన్నెల కాస్తూ ఉంది. ఒక పెంపుడు కుక్క వెన్నెల్లో ఆడుకొంటూ ఊరి బయటకు పోయింది. అడవిలోనుంచి అక్కడికి ఒకపులి వచ్చింది. అది ఆకుక్కను చూచింది. కుక్క బాగ బలిసి ఉంది. నున్నగా మెరిసి పోతూ ఉంది. మొహం కళ కళలాడుతూ ఉంది. పులి కుక్కను పలకరించింది. నేను అడవిలో మాంసం తింటున్నాను. అయినా బక్కచిక్కి ఉన్నాను. నిన్ను చూస్తే నా పళ్ళు పులిసి పోతున్నాయి. నువ్వు ఏమి తింటున్నావు అని అడిగింది పులి. కుక్కకు ఎక్కడలేని గర్వం కలిగింది. నాకొక అసామి ఉన్నాడు. నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నాకు వేళ తప్పకుండా అన్నం పెడతారు. మంచి కూరలు పెడతారు. ఆనందంగా ఉన్నాను. అందుకే ఇలా ఉన్నాను.నీవు కూడా వస్తావా? మా ఆసామి ఇంట్లో ఉందువుగాని అని అడిగింది కుక్క. పులి సరేనన్నది.కుక్కతో కలిసి ఊళ్ళోకి వెళ్ళింది.కుక్క పులికి ఆసామి ఇల్లంతా చూపెట్టింది. ఇంట్లో ఒక చోట స్తంభం ఉంది.దానికి ఒక గొలుసుంది. కుక్క దాని దగ్గర ఆగింది. ఆ గొలుసును పులికి చూపించింది. “నన్ను దీనికికట్టేస్తారు. నేను రాత్రులు ఇంటికి కాపలా కాయాలి. విడిచి పెట్టినపుడు బయట తిరుగుతాను. లేకుంటే ఈ గుంజ దగ్గరే ఉంటాను అనింది. కుక్క బతుకు పులికి అర్థమైంది. ఇదేం బతుకు. బానిస బతుకు. నేను ఇష్టం వచ్చినట్టు అడవంతా తిరుగుతాను. ఆనందంగా ఉంటాను. ఈ తిండి నాకు వద్దు. నీ బతుకు నాకు ఒద్దు. అంటూ అడవిలోకి వెళ్ళిపోయింది.

				నేను బతకొద్దా?

రామయ్య డాక్టరు దగ్గరికి పోయాడు. అయన పరీక్ష చేసాడు. ఇంత పొడుగున మందుల చీటి రాసాడు. రామయ్య మందులన్నీ కొన్నాడు పొట్లం తీసుకొని ఊరికి పోయాడు. పొట్లం మొత్తం ఇంటి ముందు బావిలో వేసాడు. ఇదంతా ఎదురింటి సుబ్బయ్య చూసాడు. అంతడబ్బు పెట్టి మందులు కొని బావిలో వేసావే! అసలు నువ్వు డాక్టరు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఫీజు ఎందుకిచ్చినట్టు? అని అడిగాడు. డాక్టరు బతకొద్దా! అన్నాడు రామయ్య. అంత డబ్బులు పోసి మందులు ఎందుకుకొన్నట్టు? అని సుబ్బయ్య అడిగాడు. మందుల కొట్టోడు బతకొద్దా? అన్నాడు రామయ్య అన్నీ తీసుకుపోయి బావిలో ఎందుకు వేసినట్టు? అని సుబ్బయ్య అడిగాడు. నేను బతకొద్దా! అన్నాడు రామయ్య.

			ఏది గొప్పది

అనగనగా ఒక రాజు. అ రాజు ఒక రోజు మంత్రిని పిలిచాడు. నమ్మకం గొప్పదా? శ్రమగొప్పదా? అని అడిగాడు. శ్రమ గొప్పది.అని మంత్రి చెప్పాడు. రాజుకు అది నచ్చలేదు. అయితే రుజువు చెయ్యి అన్నాడు రాజు. కొంతకాలం ఆగితే రుజువు చేస్తానని మంత్రి చెప్పాదు. కొంతకాలం గడిచింది. రాజుగారి సైన్యం పక్క రాజ్యం మీదికి దండెత్తి పోయింది. రాజుకోటలోనే వున్నాడు. తన సైన్యం గెలవాలని వేయి దేవుళ్ళకు మొక్కసాగాడు. ఒకరోజు రాజుగారి పూజారి వచ్చాడు. పొరుగూళ్ళో ఒక స్వామి సమాధి వుంది. అది చాలా మహిమగలది - దాన్ని మొక్కితే. కోరింది జరుగుతుంది అని రాజుకు చెప్పాడు. రాజుకు నమ్మకం కుదిరింది.మంత్రిని పిలిపించాడు. మేము వెళ్ళి ఆ సమాధికి మొక్కాలి. ఏర్పాట్లు చెయ్యండి అన్నాడు సమాధికి మొక్కితే ఏమి లాభం మహారాజా? అన్నాడు మంత్రి . మీకు తెలీదు.అది చాలా మహిమగల సమాధి అని అందరూ అంటున్నారు. వెంటనే వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి అని రాజు గద్దించాడు. మంత్రి రాజుగారి ప్రయాణానికి ఏర్పాట్లు చేసాడు. రాజుగారు మంత్రి గారితో కలిసి సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధికి ప్రదక్షిణ చేసాడు. అక్కడవున్న చెట్టుకింద కూచున్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చాడు. రాజా! మన సైన్యం యుద్ధంలో గెలిచింది.అని చెప్పాడు. చూసారా! మత్రిగారూ! మీరు ఈ సమాధిలో మహిమేలేదన్నారు. ఇప్పుడే మంటారు,అన్నాడు రాజు. తమరు మన్నించాలి. మన సైనికులు ప్రాణాలకు తెగించి యుద్ధం చేసారు. అందుకే గెలిచారు. మీరు సమాధికి మొక్కినందువల్ల గాదు అన్నాడు మంత్రి. రాజుగారికి కోపం వచ్చింది. కళ్ళెర్రచేసాడు. మంత్రిని ఉరిమి చూసాడు. మహారాజా! ఆరోజు శ్రమ గొప్పదని చెప్పాను. అదే యిప్పుడు రుజువు చేసాను. ఇది స్వామి సమాధి కాదు. ఇందులో ఉండేది కుక్క శవం. దీన్ని నేనే కట్టించాను. మహిమగలదని ప్రచారం చేయించాను. మీరే చూడండి - అని సమాధి తవ్వొంచి కుక్క ఎముకలను రాజుగారికి చూపించాడు మంత్రి. తన గుడ్డినమ్మకానికి రాజు సిగ్గుతో తలదించుకొన్నాడు.

				చాదస్తపు మొగుడు

అనగనగా ఒక ఊరు. అ ఊళ్ళో వేదయ్య అనే పంతులు ఉండేవాడు. ఆయనకు చాదస్తం ఎక్కువ. అనుమానాలు ఎక్కువ. ఒకనాడు వేదయ్య భార్యతో పాటు అన్నం తింటున్నాడు. భార్య చీకుతున్న మామిడి ముట్టె ఎగిరి వేదయ్య కంచంలో పడింది. వేదయ్యకు దిగులు పట్టుకొనింది. అపచారం జరిగిందని భయం పట్టుకొనింది. భార్య ఎంగిలికి ఏమి శాస్తి చెయ్యాలి? అని పంచాంగం తిరగేసాడు. కాశికి పోవాలని అనుకున్నాడు. తీర్మానించుకొన్నాడు. పొద్దున్నే లేచి కాశికి ప్రయాణం కట్టాడు. భార్య చెప్పినా వినలేదు. బంధువులు చెప్పినా వినలేదు. కాశీకి పోయి తీరాలన్నాడు. ఆ రోజుళ్ళో బస్సులు లేవు. వేదయ్య రోజంతా నడిచాడు. బాగా అలిసిపోయాడు. సాయంత్రానికి ఒక ఊరికి చేరాడు. రాత్రికి వంట చేసుకోవాలి. వేదయ్య దగ్గర ఉప్పు పప్పు ఉన్నాయి. వండుకొనడానికి కుండలేదు. ఒకరింటికి పోయి అడిగాడు. ఆ ఇంటి కోడలు ఒక చట్టి ఇచ్చింది. వేదయ్య ఆ చట్టిలో అన్నం వండుకుని తిన్నాడు. తిరిగి చట్టి ఇవ్వబోయాడు. చట్టి తీసుకోవడానికి కోడలు వచ్చింది. దాన్ని అత్త చూచింది. అయ్యో! ఆ చట్టి ఎందుకిచ్చావే! అది పిల్లికి అన్నం పెట్టేది గదా! పాపం నీకు తెలీదేమో! అయ్యా ఏమీ అనుకోవద్దు! అది కొత్త కోడలు! తెలీక ఇచ్చింది అనింది అత్తగారు. వేదయ్య పేగులు కలి బెట్టినట్టయింది. వేదయ్య మరుసటి రోజంతా నడిచాడు. అరాత్రికి ఒక ఊరికి చేరాడు. ఎక్కడో ఇంత వండుకుని తిన్నాడు. ఒకరి ఇంటి అరుగు మీద పడక వేసాడు. వేదయ్యకు అన్నం తిని వక్కపలుకు వేసుకునే అలవాటుంది. ఆ ఇంటామెను వక్క పలుకు అడిగాడు.ఆమె ఒక వక్క తెచ్చి యిచ్చింది. వేదయ్య పట పట మని వక్క కొరికాడు. ఈ శబ్దం విని ఇంటావిడ బయటికి వచ్చింది. నాయనా!నీవి ఎంత గట్టి పళ్ళు! నేనూ మా ఆయనా ఇద్దరం కొరికినా ఆ వక్క పగలలేదు. నీవు నిమిషంలో నమిలేసావు. అని వేదయ్య పళ్ళబలాన్ని మెచ్చుకొనింది. దీంతో వేదయ్యకు బుద్ధి వచ్చింది. కాశికి పోవడం మానుకున్నాడు. పొద్దునే లేచి ఇంటి దారి పట్టాడు.

చాదస్తపు_మొగుడు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)