User Tools

Site Tools


గంగాళం_చచ్చిపోయింది
                     			         గంగాళం చచ్చిపోయింది

రామలింగడికి ఒకసారి ఒక బిందె కావలసి వచ్చింది.తాతాచారిని అడిగాడు.ఆయన రోజుకు రూపాయి బాడుగ చెప్పాడు.రామలింగడు ఒప్పుకొని బిందె తీసుకొని పోయాడు. ఒక వారం గడిచింది.రామలింగడు బిందెతో పాటు ఒక చెంబు కూడా తెచ్చాడు.బాడుగతో పాటు చెంబు కూడా తాతాచారికి ఇచ్చాడు. తాతాచారి ఇదేమిటి?అని అడిగాడు. మా ఇంటిలో వుండగా మీ బిందెకు ఈ చెంబు పుట్టింది.తెచ్చాను.అని రామలింగడు చెప్పాడు.తాతాచారి మురిసిపోయాడు. కొంతకాలానికి రామలింగడు ఒక గంగాళం కావాలని వచ్చాడు.తాతాచారికి ఆశ పుట్టింది.బాడుగ కూడా చెప్పకుండా ఇచ్చాడు. పది రోజులకు రామలింగడు వట్టి చేతులతో వచ్చాడు. గంగాళం ఏది?అని తాతాచారి అడిగాడు. చెప్పడానికి బాధగా వుంది.అది పురిటిలో చచ్చిపోయింది అని చెప్పాడు రామలింగడు. తాతాచారికి ఒళ్ళు మండిపోయింది. గంగాళాలు చచ్చిపోతాయా?అని నిలదీసాడు. బిందెకు చెంబు పుట్టిందంటే మీరే ఒప్పు కొంటిరి.గంగాళం చచ్చిందంటే ఎందుకు ఒప్పుకోరు.పుట్టింది చావక తప్పదుగదా అని రామలింగడు దబాయించాడు.

                    			     సీతకు మొగుడు దొరికాడు

చలపతి పేదవాడు.మంచివాడు.అతడికి ఒక ఎకరం పొలం వుంది.కూలీనాలీ చేసుకొంటాడు.పూట గడుపుకుంటాడు. చలపతికి పొలంలో వచ్చేది చెప్పదగ్గ ఆదాయం గాదు.పైగా కొంత అప్పు కూడా వుంది. చలపతికి ఒకే ఒక కూతురు.పేరు సీత.చలపతి సీతను పెద్ద చదువులు చదివించలేక పోయాడు.పది దాకా చదివించాడు. ఆ చదువుకు ఏమి నౌకరు దొరుకుతుంది!ఏమీ దొరకలేదు.పైగా సీతకు పెళ్ళీడు వచ్చింది.పెళ్ళికొడుకు కోసం చలపతి వేట మొదలు పెట్టాడు. పెళ్ళికొడుకులు తేరక దొరుకుతారా?పై పెచ్చు చేసుకొనేవాడు ఇంత తిన గలిగిన వాడు కావాలి.సీతను బాగా చూచుకోవాలి. అలాంటివాడు తేలిగ్గా దొరుకుతాడా!తిరిగి తిరిగి చెప్పులు అరిగి పోయాయి. చివరికి పెళ్ళి కొడుకు దొరికాడు.సీతకు మొగుడు దొరికాడు. అయితే చలపతికి వుండే ఒక ఎకరం పోయింది.అదీ సంగతి.

                     				    సుబ్బారాయుడి దయ

మా ఊరి పొలిమేరలో ఒక పెద్ద తిప్ప వుంది.ఆ తిప్పరాళ్ళు కంకర కొట్టడానికి కొందరు కూలీలు వచ్చారు.వాళ్ళలో ఒక జంటకు ఒక మగ బిడ్డ.అప్పుడు వాడికి అయిదేళ్ళు. కొంతకాలానికి ఈ జంటలో ఆడమనిషికి జబ్బు చేసింది.ఆమె చచ్చిపోయిండి.వాడు ఆ పసివాడిని మా ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాడికి ఆమె కట్టుకొనింది కాదట.బిడ్డతో పాటు తెచ్చుకొనిందట. మా ఊళ్ళో సూబ్బారాయుడు అనే రైతు వుండే వాడు.ఆయన ఆ పసివాడ్ని ఇంటికి తీసుకొని వచ్చాడు.తిండిపెట్టి పెంచసాగాడు. సుబ్బారాయుడు దయగల మారాజు అని అందరూ పొగిడారు. ఏడాది గడిచింది.వాడికి పనులు చెప్ప సాగాడు. సుబ్బరాయుడికి చుట్టలు తెచ్చేది వాడే.నీళ్ళ తొట్టి కడిగేది వాడే.కొట్టంలో పేడ తీసేది వాడే. వాడు ఎప్పుడూ పేడ దిబ్బలోనే అడుకునేవాడు.వాడికి ఊళ్ళో వాళ్ళు దిబ్బడు అని పేరు పెట్టారు. దిబ్బడికి పదేళ్ళు వచ్చాయి.వీడు పొద్దు పొడవక ముందే సజ్జ చేలోకి పోవాల.పిట్టలు తోలాల.వచ్చేటప్పుడు గడ్డికోసుకొని రావాల.వాడికి రోజంతా చాకిరీ తోనే సరిపోయేది. దిబ్బడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి.సుబ్బారాయుడి పది మేకలు వంద అయినాయి.రెండె కరాలు పదెకరాలు అయినాయి. ఇప్పుడు సుబ్బారాయుడు మిద్దె కట్టడం మొదలు పెట్టాడు.ఆ మిద్దెకు దిబ్బడు రాళ్ళు మోసుకొని పోతుంటే నిచ్చెన జారింది.పాపం వాడు పడిపోయాడు.కాలు విరిగింది. సుబ్బారాయుడు పట్టించుకోలేదు.ఊళ్ళో వాళ్ళు చెప్పి చూచారు.అతను కలిగించుకోలేదు. ఊళ్ళో వాళ్ళు తలా కొంచెం డబ్బు దండారు.టవునికి తీసుకొనిపోయి చూపించారు.అయినా కాలు కట్టుకోలేదు.లాభం లేక కాలు తీసేసారు. దిబ్బడు బిచ్చగాడుగా మారిపోయాడు. సుబ్బారాయుడి దయ ఇప్పుడు ఏమైంది?చెప్పండి.

                             ఏళ్ళు మారినా

ఊళ్ళో కోళ్ళు కూసాయి కొడళ్ళు నిద్దర లేచారు సద్దికూళ్ళు మూట గట్టారు తాళ్ళు,కొడవళ్ళు చేత పట్టారు కట్టెలకోసం అడవి దారి పట్టారు దారంతా మూళ్ళు,రాళ్ళు,తేళ్ళు అడవి నిండా తోడేళ్ళు మైళ్ళు నడిచారు,వళ్ళు వంచారు. పేళ్ళు ఏరారు,పళ్ళు కోసారు సద్దికూళ్ళు తాగారు,ఇళ్ళదారి పట్టారు పైన రోళ్ళ పగిలే ఎండలు కాళ్ళు పుళ్ళు పడ్డాయి నోళ్ళు ఎండిపోయాయి మగాళ్ళు ఎదురు రాలేదు ఏళ్ళు మారినా ఊళ్ళు మారినా? ఆడవాళ్ళ బతుకులు మారేనా? అనుకుంటూ ఇళ్ళు చేరారు.

                      			  రామలింగడి ఆవు

ఒక రోజు రమలింగడి ఆవు తప్పిపోయింది.అది బాగా పాలిచ్చే ఆవు. దాని కోసం ఎంతో వెతికించాడు.అయినా దొరకలేదు.మంచి అవు పోయింది ఎలాగబ్బా అని అలోచించాడు. నా ఆవు తప్పి పోయింది.అది బాగా పాలిచ్చే అవు.పట్టుకొచ్చిన వాళ్ళు పది రూపాయలకే దానిని కొని తీసుకొనిపోవచ్చు.అని దండోరా వేయించాడు. రెండు రోజులు గడిచాయి.ఒకడు రామలింగడి దగ్గరికి ఆవును పట్టుకొని వచ్చాడు.పది రూపాయలు ఇచ్చాడు.ఆవును తీసుకొని పోతాను అని అడిగాడు. దూడలేకుండా పాలు ఎలా పిండుకుంటావు,దూడను కూడా తీసుకొనిపో అని రమలింగడు చెప్పాడు. ఆవును తెచ్చిన వాడు బలే సంబర పడ్డాడు.దూడ కోసం పలుపు పేన సాగాడు. అబ్బాయీ! ఇది మంచి కోడె దూడ.దీని ధర అయిదు వందలు.ఆ డబ్బు కూడా తెచ్చావా?అని రమలింగడు వాడి మోహంలోకి చూచాడు. ఇంక చెప్పేది ఏముంది?వచ్చినవాడు వచ్చిన దారి పట్టాడు.రామలింగడి ఆవు రామలింగడి కొట్టంలోకి చేరింది.

గంగాళం_చచ్చిపోయింది.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)